|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 10:49 PM
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ (డే/నైట్) టెస్ట్లో భారత మహిళల జట్టు ఓటమి ముంగిట నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో టీమిండియా తీవ్ర ఒత్తిడిలో పడింది.రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 6 వికెట్లకు 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ప్రతికా రావల్ (84 బంతుల్లో 6 ఫోర్లతో 43)తో పాటు స్నేహ్ రాణా (4) నిలబడి ఉన్నారు. ఈ దశలో భారత్ ఇంకా 20 పరుగుల వెనుకంజలో ఉంది.ఆస్ట్రేలియా బౌలర్లలో హమిల్టన్ (3/32) మూడు వికెట్లు తీసి భారత్ను కుదేలు చేయగా.. అన్నబెల్ సదర్లాండ్ (2/15) రెండు వికెట్లు సాధించింది. బ్రౌన్కు ఒక వికెట్ దక్కింది. మ్యాచ్ ఫలితం మూడో రోజు ఆట తొలి సెషన్లోనే తేలే అవకాశముంది. మిగిలిన నాలుగు వికెట్లు త్వరగా పడితే ఆస్ట్రేలియా విజయాన్ని ఖరారు చేసే అవకాశముంది.ఇదిలా ఉండగా 96/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 90.4 ఓవర్లలో 323 పరుగుల భారీ స్కోర్ చేసింది. అన్నబెల్ సదర్లాండ్ (171 బంతుల్లో 17 ఫోర్లతో 129) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా.. ఎల్లిస్ పెర్రీ (116 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్తో 76) హాఫ్ సెంచరీతో జట్టుకు బలమైన స్కోర్ అందించింది. భారత బౌలర్లలో సయాలి సత్ఘరే (4/50) నాలుగు వికెట్లు తీసి మెరిసింది. క్రాంతి గౌడ్ (2/72), దీప్తి శర్మ (2/67) చెరో రెండు వికెట్లు తీసారు. స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.తొలి ఇన్నింగ్స్లో 125 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ప్రారంభంలోనే వరుస షాక్లు తగిలాయి. స్మృతి మంధాన (2), షెఫాలీ వర్మ (5), జెమీమా రోడ్రిగ్స్ (14), హర్మన్ప్రీత్ కౌర్ (11), రిచా ఘోష్ త్వరగా ఔటవడంతో జట్టు 82 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది.ఈ సమయంలో ప్రతికా రావల్ ఒంటరి పోరాటం చేస్తూ స్నేహ్ రాణాతో కలిసి జట్టు స్కోర్ను 100 పరుగుల మార్క్ దాటించింది. లేకపోతే భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలయ్యే పరిస్థితి ఏర్పడేది. దాదాపు 20 నెలల తర్వాత భారత మహిళల జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం, ముఖ్యంగా పింక్ బాల్తో అనుభవం తక్కువగా ఉండటం వల్ల ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. స్వింగ్ అవుతున్న పింక్ బాల్కు టీమిండియా బ్యాటర్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.
Latest News