|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:57 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో విశాఖపట్నానికి వరుసగా ఐటీ కంపెనీలు క్యూ కట్టాయి. గూగుల్, ఇన్ఫోసిస్, టీసీఎస్తో పాటూ మరికొన్ని కంపెనీలు విశాఖకు ఎంట్రీ ఇచ్చాయి.. మరికొన్ని కంపెనీలు త్వరలోనే రాబోతున్నాయి. అయితే తాజాగా ఐటీ దిగ్గజం ఐబీఎం కూడా విశాఖపట్నం రాబోతోంది. దీనికోసం ఐబీఎం ఎస్టీపీఐ (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా)లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఎస్టీపీఐ వెల్కం ఐబీఎం అంటూ ఎక్స్లో ట్వీట్ చేసింది.
విశాఖపట్నంలో ఐబీఎం మూడేళ్లలో రూ.321 కోట్ల విలువైన ఎక్స్పోర్ట్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఐబీఎం రూ.700 కోట్లతో స్థానికంగా 502 మందికి ఉపాధి కల్పించనుంది. విశాఖపట్నంలో ఐబీఎం ఇప్పటికే అవసరమైన స్థలం కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విశాఖపట్నంలోని రుషికొండ-3పై కెనెక్సా అనే కంపెనీ భారీగా భూమిని కేటాయించారు. మొత్తం 25 ఎకరాల్లో ఆ కంపెనీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆ భూమిని ఐబీఎం తీసుకుంది. కానీ కొన్ని కారణాలతో ఐబీఎం తమకు 3.20 ఎకరాలు సరిపోతుందని చెప్పి.. మిగిలిన 21.80 ఎకరాల భూమిని తిరిగి ఏపీఐఐసీకి అప్పగించారు.
అయితే కరోనా సమయంలో ఐబీఎం తమ భవనాన్ని మరో సంస్థకు అమ్మేసి విశాఖపట్నం నుంచి వెళ్లిపోయింది. కూటమి ప్రభుత్వం ఐబీఎం వెనక్కు ఇచ్చిన 21.80 ఎకరాలను టీసీఎస్కు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఐబీఎం విశాఖపట్నానికి తిరిగి రావాలని నిర్ణయం తీసుకుని.. ఎస్టీపీఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మరి ఐబీఎం విశాఖపట్నం ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు మరోవైపు ఇన్ఫోసిస్ శాశ్వతంగా క్యాంపస్ నిర్మించేందుకు ఎండాడలో 20 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంను ఐటీ హబ్గా అభివృద్ధి చేస్తోంది. సాగర తీర నగరంవైపు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.. ఏపీ ప్రభుత్వం భూములతో పాటుగా ఆయా కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తోంది.