హర్మూజ్ మూసివేతతో గ్లోబల్ ఇంధన సంక్షోభం.. భారత్‌‌‌ రేషన్ విధానం అమలు చేస్తుందా?
 

by Suryaa Desk | Tue, Mar 03, 2026, 07:21 PM

ఇజ్రాయెల్- అమెరికా దాడుల్లో తమ సుప్రీం నేత మరణాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు, దాని మిత్రదేశాలను టార్గెట్ చేసుకుంది. గత మూడు రోజులుగా గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జల సంధిని మూసివేసిన ఇరాన్.. ఎవరైనా దాటేందుకు ప్రయత్నిస్తే ట్యాంకర్లను పేల్చేస్తామని హెచ్చరించింది. దీంతో గత రెండు రోజుల్లోనే ఈ జల సంధి రవాణా 86 శాతం పడిపోయింది. 700లకుపైగా నౌకలు ఆ మార్గంలో నిలిచిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఆందోళన చెందుతున్నాయి.


హర్మూజ్‌ జలసంధిని అధికారికంగా మూసివేయకపోయినా పరిస్థితి మాత్రం అలాగే ఉందని మారిటైమ్ విశ్లేషణ సంస్థలు విండ్‌వర్డ్, కెప్లర్ డేటాలు వెల్లడించాయి. మార్చి 1న కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే 2.8 మిలియన్ బ్యారెళ్ల చమురుతో ఈ జల సంధిని దాటాయి. ఈ ఏడాది రోజూ సగటున 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరుగుతుండగా.. ప్రస్తుతం 86 శాతం మేర పడిపోయింది. ఇరువైపులా 706 ట్యాంకర్లు నిలిచిపోగా.. ఇందులో 334 క్రూడాయిల్, 109 డర్టీ ప్రోడక్ట్, 263 శుద్ధిచేసిన ఇంధన ట్యాంకర్లు ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మరో 26 ట్యాంకర్ల గమ్యస్థానం ఏంటో తెలియదు.


ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ ఆయిల్ మార్కెట్లపై ఇప్పటికే మొదలైంది. బ్రెంట్ క్రూడాయిల్ 10 శాతం మేర పెరిగి బ్యారెల్ 80 డాలర్లకు చేరుకోగా.. ఐరోపాలో గ్యాస్ ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. సోమవారం సౌదీ అరేబియాలో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ రాస్ తనూరా‌, ఖతార్‌లో ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ దాడితో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా స్తంభించిపోయి ఆయిల్ సరఫరా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. హర్మూజ్‌వైపు ప్రయాణించే నౌకలకు రవాణా ఛార్జీలు పెంచడంతో అదనపు ఖర్చులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై ప్రభావం చూపనున్నాయి.


వారాలు పాటు ఇలాగే ఉంటే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. ఆసియా, ఐరోపాలోని రిఫైనరీలు ప్రత్యామ్నాయ వనరులవైపు మొగ్గుచూపుతున్నాయి. ఎక్కువగా గల్ఫ్ చమురుపై ఆధారపడే చైనా, భారత్‌లకు ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అత్యవసర చర్యలకు ఉపక్రమించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశీయ సరఫరా గొలుసును కాపాడేందుకు పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొన్నాయి.


దీనిపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ పూరి ఎక్స్ (ట్విట్టర్)లో స్పందిస్తూ.. ‘‘నిరంతరం పరిస్థితిని గమనిస్తున్నాం.. దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, అందుబాటు ధరలను నిర్దారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు.


పరిశ్రమ వర్గాల నివేదికల ప్రకారం.. శుద్ధిచేసిన చమురు భారత్ గణనీయంగా ఎగుమతి చేస్తోంది. పెట్రోల్‌‌లో దాదాపు మూడో వంతు, డీజిల్‌లో నాలుగో వంతు విదేశాలకు వెళ్తున్నాయి. దేశీయ అవసరాల్లో దాదాపు 80 నుంచి 85 శాతం గ్యాస్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుండగా.. ఇందులో ఎక్కువ మొత్తం గల్ఫ్ దేశాల నుచి హర్మూజ్ జలసంధి ద్వారా చేరుతోంది. అక్కడ నుంచి ట్యాంకర్ల రాక నిలిచిపోతే ప్రస్తుతం ఉన్న నిల్వలు మరో రెండు వారాల వరకు సరిపోతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఇక, భారత్ వద్ద ప్రస్తుతం 74 రోజుల వరకూ సరిపడే నిల్వలు ఉన్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక, హెచ్‌ఫీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతున్నాయి. తొలుత యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. కానీ, తాజాగా కొద్ది వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో దేశీయ ఇంధన భద్రతను కాపాడుకుంటూనే, ప్రపంచానికి ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న తన పాత్ర మధ్య సమతుల్యత సాధించాల్సిన క్లిష్ట పరిస్థితిని భారత్ ఎదుర్కొనే అవకాశం ఉంది.

Latest News
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM
Kerala CM race enters final lap; AICC observers reject 'support list' leak Fri, May 08, 2026, 04:21 PM
Delhi minister Kapil Mishra inaugurates project worth Rs 70 lakh in Sonia Vihar Fri, May 08, 2026, 04:21 PM
Bihar TRE aspirants protest delay in recruitment exam notification; police resort to lathi charge Fri, May 08, 2026, 04:17 PM