|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 06:13 PM
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో చిన్న పదవి వచ్చినా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారని.. అలాంటిది ఏకంగా టీటీడీ ఛైర్మన్ పదవి వస్తే.. బీఆర్ నాయుడు ఆ పదవికి తగినట్లుగా హుందాగా నడుచుకున్నారా అని రోజా ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్గా హుందాతనంతో ఎప్పుడైనా వ్యవహరించారా అని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ హోదాలో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఇంగితం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కొండ మీద ఎన్నో అపశ్రుతులు చోటుచేసుకున్నాయని రోజా ఆరోపించారు. గోవుల మృతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.
"హిందువులు అందరూ భగవద్గీతలో ప్రతిరోజూ ఒక పేజీ అయినా చదవాలని పెద్దలు చెప్తారు. భగవద్గీత సారాంశాన్ని అర్థం చేసుకుని జీవితంలో ఆ విధంగా నడుచుకోవాలని చెప్తారు. కానీ బీఆర్ నాయుడు మాత్రం.. భగవద్గీతలో ఏముంది, చెత్త తప్ప అని అంటారు.. మూతి మీద నాలుగు పటపటా వేయాలనిపించింది. ఆయనకు భగవద్గీత సారాంశం ఏం తెలుసు? అందుకే అలాంటి మాటలు మాట్లాడారు."
"బీఆర్ నాయుడు వ్యాఖ్యల మీద హిందువులు తిరగబడాలి. బీజేపీ, హిందూ సంఘాలు, ధార్మిక సంస్థలు బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై స్పందించి, బుద్ధి చెప్పాలి. హిందూధర్మం మీద నమ్మకం లేని వ్యక్తికి టీటీడీ ఛైర్మన్గా కొనసాగే అర్హత లేదు. వెంటనే ఆయనతో రాజీనామా చేయించాలి " అని రోజా డిమాండ్ చేశారు.
తిరుపతిలో వైసీపీ ఆందోళన
మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరుపతిలో ఆందోళనకు దిగాయి. మంగళవారం ఉదయం అలిపిరి గరుడ కూడలి వద్ద వైసీపీ కార్యకర్తలు, నేతలు బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలను బీఆర్ నాయుడు భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. సనాతన ధర్మ పరిరక్షణలో ముందు ఉంటాననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి బీఆర్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలని.. వెంటనే ఆయనను టీటీడీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు 30 యాక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో నిరసనకు దిగిన వైసీపీ నేతలపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.