|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:43 PM
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్లో జరిగిన ఈ ఘటనలో భారత సంతతికి చెందిన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడంతో దీని వెనుక ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ దాడిలో విద్యార్థినితో పాటు మరొకరు మరణించగా, 14 మంది గాయపడ్డారు.ఆదివారం తెల్లవారుజామున ఆస్టిన్లోని ఓ బీర్ గార్డెన్ వెలుపల ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సెనెగల్కు చెందిన నియాగా డయాగ్నే (53) అనే వ్యక్తి ఇరాన్ జెండా గుర్తు ఉన్న టీషర్ట్తో జనంపైకి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ముందు పిస్టల్తో, ఆపై రైఫిల్తో తూటాల వర్షం కురిపించాడు. ఈ దాడిలో భారత సంతతి విద్యార్థిని సవితా షాన్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని కాల్చి చంపారు.ఈ ఘటనను ఎఫ్బీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. నిందితుడు ధరించిన టీషర్ట్పై "ప్రాపర్టీ ఆఫ్ అల్లా" అని రాసి ఉండటం, ఇరాన్ జెండా గుర్తు ఉండటంతో ఇది ఉగ్రవాద చర్యేనని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతీకార దాడులు జరగొచ్చని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ హెచ్చరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Latest News