‘ఆంధ్రప్రదేశ్‌ పేరు మార్చాలి’: గరికపాటి
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 10:59 PM

కేరళ రాష్ట్రం పేరు మార్చడానికి కేంద్ర కేబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రం పేరు మార్చే విషయమై కేరళ అసెంబ్లీ ఇప్పటికే పలు మార్లు తీర్మానాలు చేసింది. ఇటీవల రాష్ట్రం పేరు మార్చే తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఆమోదం తెలపగా.. కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేరళ పేరును కేరళంగా మార్చనున్నారు. ఇప్పుడు ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా మార్చాలనే డిమాండ్లు వినిపిస్తున్నయి. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు సైతం ఇదే డిమాండ్ చేశారు.


‘‘కేరళ వాళ్లకు ఉన్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకు లేదు. ఇటీవల కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును కూడా ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా తెలుగునాడు అని మార్చాలి. అప్పుడే మనకు జాతీయాభిమానం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఎంతో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. మన రాష్ట్రం పేరును తమిళనాడు లాగే.. తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే కేరళ వాళ్లు ఇబ్బందయ్యింది. మా రాష్ట్రం, మా భాష.. మార్చాల్సిందే అనుకున్నారు. కేరళ పేరును కేరళంగా మార్చుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరే కాదు మన బతుకులు కూడా మారతాయి’’ అని గరికపాటి వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమలాపురంలో నిర్వహిస్తూన్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రసంగిస్తూ గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.


మహర్షులు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు తప్పుకోవడం మనం ఒత్తిడిలో జీవిస్తున్నామని గరికపాటి వ్యాఖ్యానించారు. తల్లి కడుపులో నుంచి బయటకొచ్చింది మొదలు చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరూ ఆందోళనతోనే ఉంటున్నారన్నారని ఆయన తెలిపారు. ఆత్మసిద్ధి పొందడం కోసం ఒకటో తెలుగు వాచకంలోనే నాలుగు మాటలు పెట్టారన్నారు. ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరి చేసినప్పుడు మాత్రమే తెలుగు భాష బతుకుతుందన్నారు. తన ఇద్దరు పిల్లలను తాను తెలుగు మీడియంలోనే చదివించానని ఆయన చెప్పారు. తెలుగు మాధ్యమం వల్ల ఎవరూ నష్టపోలేదని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు మాధ్యమంలోనే చదవాలని నిర్ణయించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సొంత దేశంలోనే ఉండాలని, ఇక్కడే పని చేయాలని అనుకుంటే భారతదేశం ఐదేళ్లలోనే విశ్వగురువుగా మారుతుందన్నారు.


ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఆంధ్ర అనేది ఒక ప్రాంతాన్ని సూచిస్తుందని.. తెలుగు అనేది భాషాపరంగా అందర్నీ ఏకం చేస్తుందని ఆయన నమ్మారు. అందుకే రాష్ట్రం పేరు మార్చే విషయమై ఆయన అసెంబ్లీలో చర్చలు జరిపారు. కొందరు ఆయన ఆలోచనతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం ఆంధ్ర అనే చారిత్రక పేరును మార్చడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాష్ట్రం పేరును మార్చలేకపోయారు. అయినప్పటికీ.. తెలుగు గంగ, తెలుగు గ్రామీణ పథం లాంటి పేర్లతో ఆయన తెలుగు పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు.

Latest News
Delhi-NCR wakes up to rain, dust storm; heat eases as mercury drops Wed, Apr 29, 2026, 11:36 AM
BJP's intention is to forcefully rig elections: CM Mamata Wed, Apr 29, 2026, 11:34 AM
FIFA chief Infantino applauds PM Modi's football session in Sikkim Wed, Apr 29, 2026, 11:32 AM
Prayed to Lord Bholenath for happiness, well-being of countrymen, says PM Modi Wed, Apr 29, 2026, 11:29 AM
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 11:24 AM