ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా హతం
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 10:50 PM

పశ్చిమాసియా రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో హతమయ్యారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా తాజాగా ధృవీకరించింది. వీరితో పాటు మరో 30 మంది నేతలు కూడా ఈ దాడుల్లో హతమైనట్లు తెలుస్తోంది. మరి ఎవరెవరు చనిపోయారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఖమేనీ కుటుంబమే లక్ష్యంగా దాడులు..!


ఖమేనీ కుటుంబ సభ్యుల మరణవార్తనుఇరాన్‌కు చెందిన 'ఫార్స్' వార్తా సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. "సుప్రీం లీడర్ నివాసంలోని నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం.. ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు ఈ దాడుల్లో వీరమరణం పొందారు" అని పేర్కొంది. శనివారం ప్రారంభమైన ఈ మేజర్ కాంబాట్ ఆపరేషన్ ఇరాన్ నాయకత్వ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమేనీ భద్రతా సలహాదారు అలీ షమ్ఖానీ, ఐఆర్‌జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్‌పూర్, రక్షణ మంత్రి అజీజ్ నసీర్‌జాదే, ఖమేనీ చీఫ్ మిలిటరీ సెక్రటరీ మొహమ్మద్ షిరాజీ, ఇరాన్ సైనిక నిఘా విభాగం అధిపతి సలేహ్ అసదీ, రక్షణ పరిశోధన, ఆవిష్కరణల సంస్థ ప్రస్తుత ఛైర్మన్ హుస్సేన్ జబల్ అమేలియన్, ఎస్పీఎన్‌డీ మాజీ ఛైర్మన్ రెజా మొజాఫరీ-నియా వంటి నేతలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.


  ఖమేనీ మరణంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఘాటుగా స్పందించారు. "చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకడైన ఖమేనీ మరణించాడు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు ఆయన చేతిలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది అమెరికన్లకు దక్కిన న్యాయం" అని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ఖమేనీ నివాసాన్ని ధ్వంసం చేశామని, ఆయన మరణానికి అనేక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ మీడియా కూడా తమ సుప్రీం లీడర్ ఖమేనీ అంతమయ్యారని అధికారికంగా ప్రకటించింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు సైతం చనిపోయారని చెప్పింది. వీరు మాత్రమే కాకుండా మరో 30 మంది హేమాహేమీలు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది.


ప్రతీకారంగా క్షిపణి దాడులు


ఈ దాడులను చట్టవిరుద్ధమైనవిగా అభివర్ణించిన ఇరాన్.. వెంటనే ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా స్థావరాలు ఉన్న కనీసం ఏడు గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరుకుంది. రాబోయే వారం రోజుల పాటు ఇరాన్‌పై బాంబుల వర్షం కొనసాగుతుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM