|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 08:08 PM
హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుమల పర్యటనకు సంబంధించి తన అనుభవాలను మీనాక్షి చౌదరి పంచుకున్నారు. తిరుమల పర్యటనలో తన అనుభూతులు, ఆనందాన్ని వీడియో ద్వారా తెలియజేశారు. మరోవైపు మీనాక్షి చౌదరి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం విశేషం. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్న మీనాక్షి చౌదరి.. శ్రీవారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన విశేషాలకు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
" తిరుమల శ్రీవారిని నేను ఈ మధ్యనే దర్శించుకున్నా. నేను పొందిన అనుభూతి, ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను తిరుమలకు తరుచుగా వెళ్తుంటా. అయితే తిరుమలకు వచ్చిన ప్రతిసారీ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. తిరుమలలో గాలి కూడా గోవింద నామస్మరణ చేస్తుంది. మనకు ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా తిరుమలలో అడుగుపెట్టగానే మన మనసు ఓ ట్రాన్స్లోకి వెళ్లిపోతుంది. నన్ను నేను మర్చిపోయి గోవిందుడి దర్శనం చేసుకుంటా. దర్శనం తర్వాత ఓ చిన్న విషయం గమనించా. మన దర్శనం కోసం ఎంతోమంది మనకు తెలియకుండా కష్టపడుతుంటారు. వాళ్లే టీటీడీ సిబ్బంది. "
" టీటీడీ సిబ్బంది చేసేది సేవా కార్యక్రమమే కాదు, మహా యజ్ఞం. అన్నదానం నుంచి ప్రసాదం వరకూ టీటీడీ సిబ్బంది అందించే సహకారం మాటల్లో చెప్పలేం. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే.. జపాన్లో ప్రజారవాణా వ్యవస్థ ఎంత కచ్చితంగా టైమ్కు వస్తుందో.. అలాగే తిరుమలలోనూ ప్రజా రవాణా సేవలు అందిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఉచిత బస్సు వస్తోంది. బస్టాండ్ వద్ద బస్సుల టైమింగ్ ప్రదర్శిస్తున్నారు. వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంది. "
"టీటీడీ మన తిరుమల పర్యటనను చాలా ఆనందంగా మారుస్తోంది. అందుకే తిరుమలకు వెళ్తుంటే ఎంతో పీస్ ఫుల్గా ఉంటోంది. టీటీడీకి థ్యా్ంక్స్ చెప్పాలనిపిస్తోంది. తిరుమల కేవలం ఆలయం మాత్రమే కాదు మన హృదయాన్ని శుభ్రపరిచి. మన మనసును ప్రశాంతపరిచి, మనల్ని మనకు మళ్లీ కనెక్ట్ చేసే ఓ డివైన్ ఎక్స్పీరియన్స్. ఓం నమో వేంకటేశాయా" అని చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి.
Latest News