|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 07:46 PM
తాత్కాలిక మాజీ ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్పై బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. తనను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించేందుకు యూనస్ కుట్రలు చేశారని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్ బెంగాలీ దినపత్రిక కలేర్ కాంథోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహమ్మద్ షాబుద్దీన్ మాట్లాదుతూ.. యూనస్ పదవీకాలంలో బంగ్లాదేశ్ను అస్థిరపరిచేందుకు, రాజ్యాంగ శూన్యతను సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. ఏడాదిన్నర పాటు తాను ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదని, అయినప్పటికీ తనను తొలగించేందుకు చాలా కుట్రలు జరిగాయని అన్నారు.
‘‘ఏడాదిన్నర నేను ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదు.. కానీ, నాకు వ్యతిరేకంగా అనేక కుట్రలు జరిగాయి.. దేశంలో శాంతిభద్రతలను శాశ్వతంగా నాశనం చేయడానికి, రాజ్యాంగ శూన్యతను సృష్టించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి’’ అని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆరోపించారు. యూనస్ తనతో రాజ్యాంగపరంగా అవసరమైన కమ్యూనికేషన్ను కొనసాగించలేదని అన్నారు. విదేశీ పర్యటనల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్ణయాల గురించి వివరించలేదని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ అసలు రాజ్యాంగ నిబంధనలను అనుసరించలేదని దుయ్యబట్టారు.
‘విదేశీ పర్యటనలకు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత అధ్యక్షుడ్ని కలిసి వాటి వివరాల గురించి తెలియజేయాలి.. కానీ, యూనస్ 14 నుంచి 15 విదేశీ పర్యటనలకు వెళ్లినా నాకు ఒక్కసారి కూడా సమాచారం ఇవ్వలేదు.. ఎన్నడూ నన్ను కలవలేదు.’ అని షాబుద్దీన్ విమర్శించారు. అంతేకాదు, ఏడాదిన్నర పాటు తాను అధ్యక్ష భవనంలో ఖైదీగా ఉండిపోయానని, షెడ్యూల్ చేసిన కొసావో, ఖతార్ పర్యటనలను యూనస్ రద్దుచేశారని ధ్వజమెత్తారు.
133 ఆర్డినెన్స్ల జారీతో సహా ప్రభుత్వ నిర్ణయాలపై అధ్యక్షుడితో యూనస్ సమన్వయం చేసుకున్నారా అనే ప్రశ్నకు? షాబుద్దీన్ సమాధానమిస్తూ.. పరిస్థితుల కారణంగా కొన్ని ఆర్డినెన్స్లు తప్పనిసరి అయినప్పటికీ, ఇంత పెద్ద సంఖ్యలో జారీ చేయాల్సినంత అవసరం లేదన్నారు. ఎన్నికలకు ముందు తాత్కాలిక ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న చివరి ఒప్పందం గురించి మీకు తెలుసా? అని ప్రశ్నించగా.. దాని గురించి తనకు తెలియదని, అలాంటి పరిణామాలను అధికారికంగా తనకు తెలియజేయాలని ఆయన అన్నారు.
‘‘ఒకానొక సమయంలో, రాజ్యాంగ విరుద్ధంగా మాజీ ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి నా స్థానంలో కూర్చోబెట్టడానికి కుట్ర జరిగింది.. కానీ రాజ్యాంగ పరిమితులను చూపుతూ ఒక న్యాయమూర్తి ఆ ప్రతిపాదనను తిరస్కరించారు’’ అని ఆయన అన్నారు. 2024 అక్టోబర్ 22న బంగభబన్ వెలుపల జరిగిన నిరసనలను ‘భయంకరమైన రాత్రి’ గా షాబుద్దీన్ అభివర్ణించారు. అల్లరిమూకలు చుట్టుముట్టి, అధ్యక్ష నివాసాన్ని దోచుకోవడానికి ప్రయత్నించగా, సైన్యం వారిని చెదరగొట్టిందని ఆయన పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగ విలువల పరిరక్షణలో సైన్యం, బీఎన్పీ నాయకత్వం సహకారం అందించిందని అన్నారు.
Latest News