|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 08:01 PM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఉత్తర్ ప్రదేశ్లోని ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసుపై పోలీసులు విచారణ లోతుగా సాగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్కు బానిసైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు నిషిక (16), ప్రాచి (14), పఖీ (12) ఫిబ్రవరి 4 ఉదయం తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ మొబైల్ ఫోన్లను తండ్రి ఛేతన్ కుమార్ తీసుకుని, వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో కరెంట్ బిల్లు కట్టిన తర్వాత ముగ్గురు సోదరిలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. కొరియన్ కంటెంట్ను అధికంగా చూడటంతో తాను వారి మొబైల్ ఫోన్లు తీసుకున్నట్టు తండ్రి పేర్కొన్నారు.
స్టాక్ బ్రోకర్ అయిన ఛేతన్ కుమార్ రూ. 2కోట్లకుపై అప్పులో మునిగిపోయి.. కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు విచారణలో తేలింది. కొరియన్ కంటెంట్కు వీరాభిమానులైన ఆ ముగ్గురు బాలికలు.. ఘటన జరిగిన ముందు రోజు రాత్రి తమ తల్లుల వద్ద మొబైల్ పోన్లు తీసుకున్నారు. అయితే, అందులో కొరియన్ కంటెంట్ చూడటానికి ప్రయత్నించినా.. యాప్స్ ఓపెన్ కాలేదు. దీంతో ఆన్లైన్ గేమ్స్ అడటం, తమ కొరియన్ స్నేహితులతో మాట్లాడటానికి అవకాశం లేకుండా పోయిందని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్ కూడా ఇదే విషయం బయటపెట్టింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చేతన్ కుమార్కు ముగ్గురు భార్యలు సుజాతీ (నిషిక తల్లి), హీనా (ప్రాచీ, పఖి తల్లి), టీనా. వీరు ముగ్గురు సొంత అక్కాచెల్లెళ్లు. ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు బాలికలకు తండ్రి అంటే ఎంతో ఇష్టమని పోలీసులు తెలిపారు. అందుకే తమ సూసైడ్ నోట్లో తండ్రి గురించి ప్రస్తావించారని, తల్లులు గురించి ఎక్కడా పేర్కొనలేదని అన్నారు. చేతిరాతతో రాసిన సూసైడ్ సోట్, మేసేజ్లు సహా వేలిముద్రలను సేకరించిన పోలీసులు.. వాటిని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపారు. నివేదిక కోసం వేచిచూస్తున్నామని అన్నారు.
సైబర్ క్రైమ్ నిరోధక టీమ్.. ఐఎంఈఐ నెంబరు ఆధారంగా మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కొరియన్ యాప్స్ డేటాను తిరిగి పొందవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆత్మహత్య కేసుగానే విచారణ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు. తండ్రి ఆరోపిస్తున్నట్టు వాళ్లు ఆన్లైన్ గేమ్కు బానిసలయ్యారా? మరేదైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
బాలిక గదిలో లభించిన తొమ్మిది పేజీల పాకెట్ డైరీతో సహా ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వారికి కొరియన్ సంస్కృతి, కంటెంట్పై ఎక్కువ ఇష్టం ఉన్నట్టు, అలాగే కుటుంబంలో గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో చేతన్ కుమార్ లివింగ్ పాట్నర్ అనుమానాస్పద రీతిలో చనిపోయింది. 2015లో సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్ర నగర్ కాలనీలోని ఒక ఫ్లాట్ పై నుంచి ఆమె పడి మరణించింది. ఆ తర్వాత పోలీసులు ఆ మరణాన్ని ఆత్మహత్యగా పరిగణించి కేసును మూసివేశారు.