|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:08 PM
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు (ఓఆర్ఆర్) సంబంధించి తెర పైకి మరో కొత్త డిమాండ్ వచ్చింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదించిన భూముల రైతులు.. భూసేకరణ ప్రణాళికలపై అభ్యంతరం తెలియజేస్తున్నారు. అలాగే బహిరంగ మార్కెట్ రేట్ల ఆధారంగా తమ భూములకు పరిహారం అందించాలని కోరుతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా రహదారిని మొదట 140 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే జనవరి ఐదో తేదీన దీనికి సవరణలు చేశారు. రహదారి వెడల్పును 140 నుంచి 250 మీటర్లకు పెంచుతూ జనవరి ఐదో తేదీన సవరించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలోనే రోడ్డుకు ఇరువైపులా 500 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటుపై అందులో ప్రస్తావించారు. అయితే దీని కారణంగా ప్రైవేట్ వ్యవసాయ భూమిని పెద్ద ఎత్తున స్వాధీనం స్వాధీనం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పును 140 నుంచి 250 మీటర్లకు పెంచడం ఏకపక్షంగా ఉందంటూ కొంతమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విస్తరణ.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభ ప్రతిపాదనను, ప్రాజెక్ట్ వాస్తవ అవసరాలను కూడా చాలా మించిపోయిందని రైతులు చెప్తున్నారు. సరైన సాధ్యాసాధ్యాల అధ్యయనం, సాంకేతిక అంచనా ఆధారంగా రహదారి వెడల్పును 70 మీటర్లకు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు భూసేకరణ చట్టంలోని సెక్షన్ 26(1) ప్రకారం తమ భూములకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఈ సెక్షన్ ప్రకారం ప్రతిపాదన చేసిన సంవత్సరానికి ముందు మూడేళ్లలో,సమీప ప్రాంతాలలో జరిగిన ఇలాంటి భూ లావాదేవీలలో అత్యధిక ధరను పరిగణలోకి తీసుకోవాలని.. దాని ప్రకారం భూములకు పరిహారాన్ని లెక్కించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విలువకు నాలుగు రెట్లు అధికంగా చెల్లింపులు చేయాలన్నారు.
మరోవైపు రైతులకు న్యాయం జరిగేలా చూడటానికి, వారి భూమి విలువకు ఆరు రెట్లు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే బహిరంగ మార్కెట్లో భూముల ధరకు, రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిన భూమి విలువలకు గణనీయమైన వ్యత్యాసం ఉందని రైతులు చెప్తున్నారు. పరిహారం లెక్కించే సమయంలో మార్కెట్ వాస్తవ ధరలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే భూసేకరణకు ముందు సంబంధించి భూముల యజమానులతో చర్చించి.. వారి అంగీకారంతో ముందుకెళ్లాలని కోరుతున్నారు.
Latest News