|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 07:03 PM
సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చే సమస్యలపై సత్వరమే స్పందించే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి అదే రీతిలో వ్యవహరించారు. రోడ్డు లేక బడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న చిన్నారుల సమస్యపై వెంటనే స్పందించారు. వెంటనే వారి గ్రామానికి రోడ్డును మంజూరు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా, కొండాపురం మండలంలోని గజ్జలవారిపల్లికి చెందిన విద్యార్ధులు సరైన రోడ్డు లేక పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ.. పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు.
ఈ వీడియో పవన్ కళ్యాణ్ వరకూ చేరగా.. విద్యార్థుల వేదన పవన్ కళ్యాణ్ను కదిలించింది. బురద రోడ్డులో నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసిన పవన్ కళ్యాణ్.. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని ఆ ఊరికి రోడ్డు మంజూరు చేయించారు.
శుక్రవారం రోజు వీడియో చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. రోడ్డు వేయడానికి అంచనాలు రూపొందించి.. వెంటనే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పవన్ ఆదేశాలతో1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం రూ. 86 లక్షల అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి స్కూలుకు వెళ్లే విద్యార్ధులు, పొలాలకు వెళ్లే రైతుల ఇబ్బందులు తీరనున్నాయి.
మరోవైపు ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0 కార్యక్రమాలతో పాటుగా.. సాస్కీ నిధులతో రూ. 55 కోట్లు ఖర్చు చేసి రహదారులు అభివృద్ధి చేశారు. మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0 కార్యక్రమంలో రూ. 26.6 కోట్లతో 437 రహదారుల పనులు, 2.0లో 200 రహదారుల నిర్మాణం చేపట్టారు. అలాగే 9 కోట్ల రూపాయల సాస్కీ నిధులతో 4 ప్రధాన రహదారులు నిర్మిస్తున్నారు దుత్తలూరు మండలంలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది.
అలాగే కొండాపురం మండలంలోని నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తున్నారు. సీతారాంపురం మండలంలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య ఓ రోడ్డు, వింజమూరు మండలం రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు మంజూరు చేశారు.
Latest News