|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 09:47 PM
.కొత్తగా పెళ్లైన జంటలకు హనీమూన్ డెస్టినేషన్గా గుర్తింపు పొందిన పసిఫిక్ దేశం ఫిజీ ప్రతిష్ఠ మసకబారుతోంది. ప్రస్తుతం ఆ దీవి హెచ్ఐవీకి కేంద్రంగా మారిపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికంతటికీ బ్లూటూత్ ట్రెండే కారణం. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం... రెండేళ్ల కిందట అంటే 2024లో 1583 హెచ్ఐవీ కేసులు ఫిజీలో నమోదయ్యాయి. అయితే, గతేడాది తొలి 6 నెలల్లోనే 1,226 కేసులు బయటపడ్డాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ముందు సంవత్సరంతో పోలిస్తే కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నట్లు ఫిజీ ఆరోగ్య శాఖ కలవరపడుతోంది. హెచ్ఐవీ వైరస్ ఇంతలా వ్యాపించడానికి బ్లూటూత్ ట్రెండ్ కారణమవుతోందని పేర్కొంది. డ్రగ్స్ కొనేందుకు డబ్బులు లేనివారు.. ఆ మైకం పొందడానికి అప్పటికే డ్రగ్స్ తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకోవడమే బ్లూటూత్ ట్రెండ్ . క్రిస్టల్ మెథాఫెటమైన్ అనే డ్రగ్ను వాడటమే ఈ పరిస్థితి కారణమని తేలింది. సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది అసురక్షిత పద్దతుల్లో ఒకరి రక్తాన్ని మరొకరు ఎక్కించుకోవడంతో హెచ్ఐవీ వ్యాప్తి పెరుగుతోంది.
మత్తుకు బానిసైన వ్యక్తుల ఆలోచనలు, భావోద్వేగాలను డ్రగ్స్ నియంత్రిస్తాయని, దాని ప్రభావంతో వారు మరింత దుందుడుకుగా ప్రవర్తించే అవకాశం ఉందని మానసిక నిపుణులు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పోగ్రామ్ ప్రతినిధి ముంఖ్తుయ అల్టాంజెరెల్ మాట్లాడుతూ.. ‘‘ఫిజీలో హెచ్ఐవీ వ్యాప్తి కేవలం ఆరోగ్యపరమైన సమస్య కాదు. జీవితాలను, సమాజాలను, పురోగతిని దెబ్బతీసే మానవహక్కుల సవాల్ ’’ అభిప్రాయపడ్డారు. తక్షణమే హెచ్ఐవీ వ్యాప్తి నియంత్రణకు వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. హెచ్ఐవీ పరీక్షలు పెద్ద సంఖ్యలో నిర్వహించి, బాధితులకు చికిత్సల విస్తరించాలని ఆయన తెలిపారు.
2025లో 3 వేలకుపైగా హెచ్ఐవీ కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. బీచ్లు, ప్రకృతి సోయగాలు, రిసార్టులతో పర్యాటకులను పీజీ విశేషంగా ఆకర్షిస్తోంది. గతేడాది 9,86,367 మంది పర్యాటకులు ఆ దేశానికి వచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
Latest News