|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:24 PM
రాయలసీమను రతనాల సీమగా పిలుస్తారు.. అంతటి పేరు పొందిన ప్రాంతంలో ఇప్పటికి వజ్రాల వేట జరుగుతోంది. వర్షాకాలంలో పొలాల్లో వజ్రాలు బయటపడుతుంటాయి. అయితే రాయలసీమలో రత్నాల కంటే ఖరీదైన ఖనిజ సంపద ఉందని తెలుస్తోంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లో ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు స్థానం దక్కింది. ఈ మేరకు అక్కడ ఖనిజాల కోసం అన్వేషణ చేయనున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలో 2023లో హైదరాబాద్కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పరిశోధనలు చేసింది. పలు ప్రాంతాల్లో కొన్ని ఖనిజాలు (నియోబియం, నియోడైమియం, సిరియం, లాంథనం, ప్రాసోడైమియం,స్కాండియం, జిక్రోనియం, లిథియం) ఉన్నట్లు గుర్తించారట. ఈ ఖనిజాలను ఎయిర్క్రాఫ్ట్స్, స్మార్ట్ఫోన్లు, విండ్ టర్బైన్స్, కంప్యూటర్లు వంటి వాటిలో కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు. లిథియం చాలా అరుదగా దొరికే నిక్షేపాలలో ఒకటి.. తాడిమర్రి, తురకవారిపల్లి, దాడితోట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారట. అనంతపురం జిల్లాతోపాటుగా కడప జిల్లాలో (పార్నపల్లె, లోపటనూతల) కూడా పరిశోధనలు చేయగా.. అక్కడ కూడా లిథియంను గుర్తించారట.
ఈ లిథియంను ఎక్కువగా బ్యాటరీలలో వినియోగిస్తారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటుగా డిజిటల్ కెమెరాలు, మొబైల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మేరకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఈ ఖనిజాల కోసం చేస్తున్నారు. ఏఎండీ, జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ క్షేత్రస్థాయిలో పరిశోధనలతో పాటుగా హెలికాప్టర్ సర్వే కూడా చేపట్టారు.
కేంద్రం ఇటీవల రేర్ ఎర్త్ కారిడార్లకు సహకారం అందిస్తామని తెలిపింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. సముద్ర తీరంలో బీచ్శాండ్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అరుదైన ఖనిజాలు ఉన్నట్లు తేలింది. గతంలో విశాఖఫట్నంతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాల్లో పరిధిలో బాక్సైట్ నిల్వలు గుర్తించిన సంగతి తెలిసిందే. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో బంగారం ఖనిజాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. వాటితో పాటుగా పైన తెలిపిన ఖనిజాలను కూడా గుర్తించారు. వీటి తవ్వకాలకు ముందుకొచ్చేవారికి కేంద్రం నుంచి ప్రోత్సాహం అందిస్తారు.
Latest News