|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:22 PM
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాతో జరిగే తొలి మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్లో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో పాటు దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఇషాన్ తన సత్తాను చాటాడని గుర్తు చేశారు.న్యూజిలాండ్తో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేశాడు. తిలక్ వర్మ గైర్హాజరీలో తుది జట్టులో అవకాశం దక్కించుకున్న ఇషాన్, తన విధ్వంసకర బ్యాటింగ్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్తో ఆఖరి టీ20లో శతకం బాదిన అతడు, సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లోనూ అర్థశతకంతో రాణించి తన నిలకడను నిరూపించాడు. మరోవైపు అదే సిరీస్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్ తుది జట్టులో చోటు కోల్పోయాడు.
*అతని దూకుడు జట్టుకు అవసరం : తిలక్ వర్మ తిరిగి జట్టులోకి రావడంతో, సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను ఓపెనర్గా ఆడించింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో, సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. అమెరికాతో మ్యాచ్ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ను ఓపెనింగ్ స్లాట్ గురించి ప్రశ్నించగా, ఇషాన్ కిషన్నే ఓపెనర్గా బరిలోకి దింపుతామని స్పష్టంగా చెప్పారు. అతని దూకుడైన ఆట జట్టుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, “గత కొన్ని మ్యాచ్ల్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. దేశవాళీ క్రికెట్లోనూ సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దూకుడైన ఆటతో తన జట్టును విజేతగా నిలబెట్టాడు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. అయితే వార్మప్ మ్యాచ్లో ఓపెనర్గా ఆడాడు. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా అదే దూకుడు కొనసాగించాలని కోరుకుంటున్నాను. అయితే ఫస్ట్ డౌన్ కంటే దిగువ స్థానంలో మాత్రం బ్యాటింగ్ చేయడు. ఏ స్థానం ఇచ్చినా తన జోరును కొనసాగిస్తాడని నమ్మకం ఉంది” అని తెలిపారు.
*సంజూ బెంచ్కే :ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో అతను కేవలం 46 పరుగులే చేయగలిగాడు. అతని అత్యధిక స్కోరు 24 మాత్రమే. 2025 నుంచి టీ20ల్లో ఓపెనర్గా ఆడిన 11 ఇన్నింగ్స్ల్లో 12.18 సగటుతో కేవలం 134 పరుగులే సాధించాడు, అత్యధిక స్కోరు 37.ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మాత్రం న్యూజిలాండ్తో సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 53.75 సగటు, 231.18 స్ట్రైక్రేట్తో 215 పరుగులు చేశాడు. రెండో టీ20లో 32 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా, ఆఖరి టీ20లో 43 బంతుల్లో 103 పరుగులతో శతకం సాధించాడు. సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్లోనూ అర్థశతకంతో రాణించి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగాడు. తిలక్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉండటంతో, సంజూ శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.