|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 09:49 PM
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యతను సాగునీటి సంఘాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులతో గురువారం జరిగిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అందరికీ నీటి భద్రత అవసరమే కానీ, సంరక్షణ విషయం చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఉన్న 40 జీవనదుల జలాలను సమర్థంగా నియోగించుకుంటే ఎక్కడా కరవు అనే ఊసే ఉండదని పేర్కొన్నారు. పరుగెత్తే నీటిని నిలిపి, నడిచే జలాశయంగా మార్చి, భూగర్భ జలాలు నిల్వ పెరిగేలా చూడాలని కోరారు.
నామినేషన్ కిందట సాగునీటి సంఘాలకే పనులను అప్పగిస్తున్నామని, ప్రతీ ఎకరాకూ నీరు అందించేందుకు కృషిచేయాలని సీఎం చూసించారు. అంతేకాదు, నీటి సంఘాలు చేపట్టే పనులకు జీఎస్టీ లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు కూడా బిల్లులు చెల్లించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు అన్నదాతల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని.., ఇప్పుడు కర్షకులను అనుకూలమైన రాష్ట్రంగా మారుస్తున్నామని సీఎం తెలిపారు.
నీటి పన్నులు వసూలు చేసి, ఆ నిధులతో పంట కాల్వల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని సీఎం సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 6,700 సాగునీటి వినియోగదారుల సంఘాలు, 58 డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలను నిర్వహించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఖరీఫ్, రబీలకు సరైన సమయాని పంటలకు నీరందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
వరితో పాటు ప్రత్యామ్నాయ పంటలను కూడా సాగుచేయాలని, ఆ దిశగా రైతులు దృష్టి సారించడం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భూగర్భ జలాల పెంపు, కాల్వలు, ప్రాజెక్టుల నిర్వహణలో సంఘాలు చురుకైన పాత్ర పోషించాలని చంద్రబాబు నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Latest News