|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 08:10 PM
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ 'ది వాషింగ్టన్ పోస్ట్' తాజాగా పెద్ద ఎత్తున లేఆఫ్స్ ఇచ్చింది. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా బుధవారం రోజు ఏకంగా మూడింట ఒక వంతు సిబ్బందిపై వేటు వేసింది. ఈ భారీ లేఆఫ్స్లో ప్రముఖ అంతర్జాతీయ వ్యవహారాల కాలమిస్ట్, భారతదేశ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని ఆయనే నేరుగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఉద్యోగం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూనే.. నా గుండె పగిలిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు.
12 ఏళ్ల ప్రయాణం.. ఒక్కసారిగా ముగింపు
గత 12 ఏళ్లుగా వాషింగ్టన్ పోస్ట్తో అనుబంధం ఉన్న ఇషాన్ థరూర్.. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నా గుండె పగిలిపోయింది" అంటూ ఆయన పెట్టిన పోస్ట్ నెటిజన్లను కలచివేస్తోంది. అంతర్జాతీయ విభాగానికి చెందిన అత్యంత ప్రతిభావంతులైన జర్నలిస్టులు, తన స్నేహితులు, సహోద్యోగులు కూడా ఈ లేఆఫ్స్లో ఉద్యోగాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
కొడుకు ఉద్యోగం కోల్పోవడంపై శశి థరూర్ ఏమన్నారంటే..?
"2017లో 'వరల్డ్వ్యూ' కాలమ్ ప్రారంభించినప్పుడు అమెరికా, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను పాఠకులకు వివరించడమే నా లక్ష్యం. గత కొన్ని ఏళ్లుగా నా కాలమ్ను అనుసరిస్తున్న ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లకు నేను రుణపడి ఉంటాను" అని ఇషాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇదొక బ్యాడ్ డే అని చేసిన పోస్టును ఆయన తండ్రి శశిథరూర్ కూడా రీపోస్ట్ చేశారు. ఇలా కుమారుడికి తన మద్దతును ఇచ్చారు.
వాషింగ్టన్ పోస్ట్లో ఏం జరుగుతోంది?
ఈ భారీ లేఆఫ్స్లో.. స్పోర్ట్స్ డెస్క్, బిజినెస్ విభాగం, లోకల్ రిపోర్టింగ్ టీమ్లపై కూడా ప్రభావం పడింది. ముఖ్యంగా అంతర్జాతీయ బ్యూరోలను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పత్రికకు ఉన్న నెట్వర్క్ దారుణంగా దెబ్బతింది. ఇది కేవలం ఒక సంస్థలో జరుగుతున్న తొలగింపు మాత్రమే కాదని.. గ్లోబల్ జర్నలిజానికి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Latest News