|
|
by Suryaa Desk | Thu, Feb 05, 2026, 07:28 PM
వాతికేళ్ల వివాహ వార్షికోత్సవం వివాదానికి కేంద్రంగా మారింది. నిబంధనలకు విరుద్దంగా అక్రమ మద్యం, హుక్కాతో పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని ఆటకట్టించారు. పార్టీని భగ్నం చేసి, 81 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరులో ప్రముఖ కాంట్రాక్టర్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని నిర్వాణ గ్రీన్స్ వీకెండ్ హోమ్స్ రిసార్ట్స్లో అహ్మదాబాద్లోని ప్రముఖులు 25వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఏర్పాటుచేశారు.
నిర్దిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు నిర్వాహకులపై దాడి చేశారు. ఈ పార్టీలో విలాసవంతమైన ఏర్పాట్లు కనిపించాయి. అతిథుల కోసం ప్రత్యేకంగా కేక్ టేబుల్స్, విదేశీ మద్యం, హుక్కా సేవలు అందుబాటులో ఉంచారు. పోలీసుల ఎంట్రీతో అతిథులంతా షాక్ తిన్నారు. తమ టేబుళ్ల నుంచి లేచి పరుగులు తీశారు. పార్టీకి 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారే హాజరయ్యారు.
సంఘటనా స్థలం నుంచి విదేశీ మద్యం సీసాలు, 10 హుక్కా పైపులు, 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్టీ నగరంలోని ధనిక వర్గాల కోసం ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం, అదుపులోకి తీసుకున్న 81 మందిలో 43 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నారు. పురుషులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళలకు చట్టపరమైన నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారం వదిలిపెట్టారు. ఈ పార్టీలో పలువురు ప్రముఖ బిల్డర్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తల కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్లో రాత్రి పొద్దుపోయే వరకు హై డ్రామా నడిచింది.
ఈ కేసుపై సనంద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమ మద్యం, హుక్కా ఎక్కడి నుంచి వచ్చాయో, పార్టీ నిర్వాహకులు ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. సనంద్ ప్రాంతంలో ఇలాంటి ప్రైవేట్ పార్టీలు, డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పాటిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు, వస్తువులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో పాల్గొన్నవారి నేపథ్యాలను పరిశీలించి, నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేయడానికి సిద్దమవుతున్నారు.
Latest News