|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 08:34 PM
బడ్జెట్ 2026 గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాహుల్ గాంధీ మాట్లాడుతూ... సమగ్రంగా లేదని వ్యాఖ్యానించారు. దీనిపై నిర్మలమ్మ స్పందిస్తూ.. ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారం లేదని అన్నారు. బడ్జెట్లో లోపాలు ఉన్నాయంటూ చేసిన ఆరోపణలను నిరూపించే అంశాలను రాహుల్ గాంధీ తన ముందు నిలబడి చెప్పగలరా? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలను కాంగ్రెస్ నేత చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.
బడ్జెట్లో తమ ప్రభుత్వం యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై ప్రధానంగా దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అభివృద్ధి చెందుతున్న లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత కోసం ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
బడ్జెట్ సమగ్రంగా లేదని, దేశం ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లు, సంక్షోభాలపై దృష్టి సారించలేకపోయిందని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారుతున్నారని, తయారీ రంగం పతనమవుతోందని కాంగ్రెస్ అగ్రనేత ఆరోపించారు. వ్యాపారవేత్తలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని అన్నారు. రైతాంగం ఇబ్బందులు, అంతర్జాతీయంగా తగులుతోన్న ఎదురు దెబ్బలు వంటి విషయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేంద్రంలోని మోదీ సర్కారు మాత్రం ఇది యువశక్తిపై ఫోకస్ పెట్టే బడ్జెట్ అని, 20247 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోడానికి మార్గాన్ని ఇస్తుందని పేర్కొంటోంది.
Latest News