|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 09:03 PM
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పవిత్రతను దెబ్బతీసేలా విచ్చలవిడిగా నిర్ణయాలు తీసుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలు లేకుండానే కల్తీ నెయ్యిని తయారు చేసేలా నిబంధనలను మార్చి వైసీపీ నేతలు బరితెగించారని ఆయన ఆరోపించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాణ్యత విషయంలో అడ్డగోలుగా వ్యవహరించి, హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో అపచారం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
టీటీడీ నెయ్యి కల్తీ జరిగిందని తాము అంటుంటే, అందులో జంతు కొవ్వు కలవలేదని వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు విడ్డూరంగా ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు. జంతు కొవ్వు కలవలేదని చెబుతున్న వైసీపీ నేతలు, కనీసం కల్తీ జరిగిందని పరోక్షంగా ఒప్పుకుంటున్నారని ఆయన విశ్లేషించారు. జగన్ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ అయిందని CFTRI నివేదికలు స్పష్టం చేసినప్పటికీ, నాటి పాలకులు ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆయన విమర్శించారు.
నెయ్యి సరఫరా కాంట్రాక్టుల విషయంలో జరిగిన అవకతవకలపై సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పదంగా మారిన భోలేబాబా డెయిరీని తెరపైకి తెచ్చిన ఆ 'ఆలీబాబా' ఎవరో త్వరలోనే తేలాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఈ కల్తీ మాఫియా వెనుక ఉన్నారని, వీరందరినీ చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కేవలం నెయ్యి కల్తీతోనే ఆగకుండా, టీటీడీ వంటి అత్యున్నత ధార్మిక సంస్థలో అన్యమతస్థులను నియమించి జగన్ మోహన్ రెడ్డి పవిత్రతను మంటగలిపారని మంత్రి విమర్శించారు. స్వామివారి సేవలో హిందూయేతరులను చేర్చుకోవడం ద్వారా ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి అక్రమంపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి సత్యకుమార్ హెచ్చరించారు.