|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:01 PM
రాష్ట్రంలో ప్రస్తుతం రావణ కాష్టం కొనసాగుతోందని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఇండ్లపై పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. ఇండ్లలోకి చొరబడి మహిళలు, చిన్నపిల్లలను భయబ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు అరికట్టే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరుగుతున్న దృశ్యాలను పోలీసులు లైవ్లో చూస్తూ నిలబడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అధికారానికి లొంగి కొంతమంది పోలీసులు పని చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పిన విధంగానే పోలీసు వ్యవస్థ నడుస్తోందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆక్షేపించారు. లోకేష్ రాజకీయ బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘రెడ్ బుక్’ రాష్ట్రంలో బ్లడ్ బుక్గా మారిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం పూర్తిగా అసత్యమని, సీబీఐ విచారణలో కల్తీ జరగలేదని నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు, పోలీసుల పక్షపాత వైఖరిపై ప్రజలు స్పందించాలని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.
Latest News