|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:35 PM
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ యువకుడి అత్యుత్సాహం కలకలం రేపింది. ప్రియురాలు అలిగిందన్న కోపంతో రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదే సమయానికి వస్తున్న ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో పోలీసులు, రైల్వే సిబ్బంది పరుగులు పెట్టారు.పోలీసుల వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి విజయనగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివారు. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆదివారం ప్రియురాలిని చూడాలనిపించడంతో ఆ యువకుడు తనకు టెక్కలిలో యాక్సిడెంట్ అయిందంటూ ఆమెకు అబద్ధం చెప్పాడు.ప్రియుడికి ప్రమాదం జరిగిందని ఆందోళన చెందిన యువతి, ఇంట్లో చెప్పకుండా టెక్కలికి చేరుకుంది. తీరా వచ్చి చూశాక అది అబద్ధమని తెలియడంతో యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె అలకబూని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించగా, యువకుడు ఆమెను ఆపేందుకు రైలు పట్టాలపై తలపెట్టి బెదిరించాడు.యువకుడు పట్టాలపై ఉన్నప్పుడే గుణుపూర్ వెళ్లే ప్యాసింజర్ రైలు సమీపించింది. అక్కడున్న వారు గమనించి రైలును ఆపించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. యువకుడిని పక్కకు లాగి, ఇద్దరినీ స్టేషన్కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయవద్దని హెచ్చరించి పంపించారు.
Latest News