త్రివేండ్రంలో టీమిండియా సిక్సర్ల సునామీ! ఆఖరి టీ20లో భారత్ స్కోర్ 271
 

by Suryaa Desk | Sat, Jan 31, 2026, 11:04 PM

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. త్రివేండ్రం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. ఆఖరి నిమిషంలో జట్టులో స్థానం సాధించడమే కాకుండా, తిలక్ వర్మ స్థానంలో ప్లేయింగ్ 11లోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఈ అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. తిరువనంతపురం స్టేడియంలో సిక్సర్ల మోత మోగించి 42 బంతుల్లో సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సిక్సర్ల మోత మోగడంతో భారత్ 271 పరుగులు చేసింది.


 టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఫ్లాప్ షో మాత్రం కొనసాగింది. సంజూ సొంత గడ్డ త్రివేండ్రంలో కూడా విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో అయినా ఫామ్‌లోకి వస్తాడనుకుంటే దారుణంగా విఫలమై టీ20 వరల్డ్‌కప్ ప్లేయింగ్ 11 ఛాన్స్‌లు చేజార్చుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మరోసారి బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి, వరల్డ్‌కప్‌లో తమ పేరు కన్ఫార్మ్ చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదరగొట్టాడు.


తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అయినా కమ్ బ్యాక్ ఇస్తాడనుకున్న సంజూ శాంసన్ ఆరంభంలోనే ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. వరుస బౌండరీలతో 16 బంతుల్లో 30 పరుగులు బాదిన అభిషేక్ శర్మ లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దర్నీ ఫెర్గ్యూసనే అవుట్ చేశాడు.


48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును ఇషాన్ కిషన్ - కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 56 బంతుల్లోనే 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 29 బంతులు ఆడిన సూర్యకుమార్ యాదవ్ నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 63 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి స్టంప్ అవుట్ అయ్యాడు.


సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి నాలుగు టీ20ల్లో మూడు మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 వరల్డ్‌కప్ ముందు సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి రావడంతో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులు కూడా హ్యాపీగా ఉన్నారు.


ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో మరోసారి తన సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో అదరగొట్టిన ఇషాన్.. ఆఖరి టీ20లో కూడా సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 43 బంతులు ఆడిన ఇషాన్ 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇషాన్ విధ్వంసానికి న్యూజిలాండ్ బౌలర్లు భారీ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా కూడా 17 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 42 పరుగులు చేసి అవుటయ్యారు. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ మొత్తం 23 సిక్సర్లు నమోదు చేయడం విశేషం.

Latest News
Arsenal reach Carabao Cup final after last-gasp Havertz goal Wed, Feb 04, 2026, 12:53 PM
US Senators accuse UBS of blocking Holocaust truth Wed, Feb 04, 2026, 12:48 PM
CM Mamata files fresh plea in SC to stop voter name deletions during SIR in Bengal Wed, Feb 04, 2026, 12:37 PM
TN records over one lakh new cancer cases in 2025; Chennai reports highest count Wed, Feb 04, 2026, 12:28 PM
Trump calls for federal role in US elections Wed, Feb 04, 2026, 12:23 PM