తమిళనాడులో ఎస్ఐఆర్‌‌పై సుప్రీంకోర్టు జోక్యం.. ఈసీకి కీలక ఆదేశాలు
 

by Suryaa Desk | Thu, Jan 29, 2026, 08:43 PM

తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీంకోర్టు గురువారం జోక్యం చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా, సజావుగా సాగేలా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు డీఎంకే దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది. ఏప్రిల్‌లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జరగనుండగా.. ఎస్ఐఆర్ పేరుతో భారీగా ఓటర్లను తొలగించారని డీఎంకే‌కు చెందిన ఆర్ఎస్ భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.


రాష్ట్రంలోని ఎస్ఐఆర్ అనంతరం 97 లక్షల ఓట్లను తొలగించారు.. మొత్తం ఓటర్లలో దాదాపు 88 శాతం మంది అంటే 1.72 కోట్ల మంది ఓటర్లను ‘తార్కిక వ్యత్యాసాలు’ పేరుతో జాబితాను తొలగించారని ఆయన ఆరోపించారు. పశ్చిమ్ బెంగాల్, కేరళలోనూ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సమగ్ర సవరణలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా విచారిస్తున్న సర్వోన్నత న్యాయస్థానం.. ప్రభుత్వ కార్యాలయాలలో ‘తార్కిక వ్యత్యాసాల’ జాబితాలోని ఓటర్ల పూర్తి జాబితాను ప్రచురించాలని, పేర్లు లేనివారు 10 రోజుల్లోపు సంబంధిత పత్రాలను సమర్పించడానికి అనుమతించాలని ఈసీని ఆదేశించింది.


‘ప్రతి కలెక్టర్ EC జారీ చేసిన ఆదేశాలను పాటించాలని, ఎస్ఐఆర్ సజావుగా నిర్వహించడానికి సిబ్బందిని నియమించాలని మేము ఆదేశిస్తున్నాం’ అని కోర్టు పేర్కొంది. అలాగే, శాంతిభద్రతల సమస్య లేకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డీజీపీ, పోలీస్ కమిషనర్లకు సూచించింది. SIR ఎక్కడ జరుగుతున్నా EC ఈ ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని మేము ఆశిస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టినప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. బిహార్‌లో 47 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు హాడావుడిగా ఓటర్ల జాబితా సవరణ అనేది ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చడానికి కేంద్రం, ఎన్నికల కమిషన్ పన్నిన ఒక కుట్ర అని ప్రతిపక్ష పార్టీలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వీటిని బీజేపీ, ఈసీలు కొట్టిపారేశాయి.


తమిళనాడులో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదటి దశ పూర్తయిన తర్వాత 97 లక్షల ఓటర్లను తొలగించారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య 6.43 కోట్ల నుంచి 5.41 కోట్లకు తగ్గిపోయాయి. మినహాయించిన వ్యక్తులు అప్పీల్ చేసుకునే అవకాశం జనవరి 18న ముగిసింది. తమిళనాడుకు సంబంధించిన తాజాగా వెలువరించి ఉత్తర్వు ఈ నెలలో బెంగాల్‌కు జారీ చేసిన దానికి అద్దం పడుతుంది.


బెంగాల్, రాజస్థాన్‌తో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో SIR పూర్తి చేయడానికి కోర్టు గడువును పొడిగించింది. వాదనలు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువును జనవరి 19కి పొడిగించిన సంగతి తెలిసిందే.

Latest News
Too early to judge India-US trade deal, assessment only after implementation: Mayawati Tue, Feb 03, 2026, 04:22 PM
US trade pact with India is father of all deals: Deepak Vohra Tue, Feb 03, 2026, 04:15 PM
Priyanka Gandhi accuses govt of 'letting down' Indian farmers in US trade deal Tue, Feb 03, 2026, 04:14 PM
I-PAC raids row: CM Mamata Banerjee's affidavit contradicts her past statements, says Bengal LoP Tue, Feb 03, 2026, 04:13 PM
Bangladesh polls: Supporters of barred Awami League forced to vote amid intimidation Tue, Feb 03, 2026, 04:05 PM