|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:54 PM
ఉత్తరాంధ్ర కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. తద్వారా గిరిజన రైతులకు మరింత లాభం చేకూర్చేలా కాఫీ ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఏపీ మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి అరకు ఉత్సవ్ -2026లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ మాట్లాడారు. ప్రతి గిరిజన రైతు కుటుంబంలో ఒకరికి.. పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడమే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాబోయే పదేళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. కాగా, 'అరకు ఉత్సవం- 2026' ఇక్కడి సంస్కృతిని కాపాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని తాను భావిస్తున్నట్లు మంత్రి దుర్గేశ్ చెప్పారు.
మరోవైపు, ఈ ప్రాంతంలో స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మంత్రి కందుల దుర్గేశ్. అందులో భాగంగా అరకు, పాడేరు, లంబసింగిలో.. 60 హోమ్ స్టేలను గుర్తించినట్లు వెల్లడించారు. అరకు హరిత యాత్రి నివాస్లో గదుల సంఖ్యను 40 నుంచి 60కి పెంచినట్లు చెప్పారు. మత్ర మయూరి రిసార్ట్లో 65 నుంచి 98కి, తైడ జంగిల్ బెల్స్లో 13 నుంచి 26కి గదుల సంఖ్యను పెంచామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తూర్పు తీరం.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి కూటమి ప్రభుత్వం సంకల్పించుకుందని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు. జల్- జంగిల్- జమీన్ స్ఫూర్తితో అరకు ప్రాంతాన్ని పర్యావరణహిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని చెప్పారు. దాంతోపాటు 2014-15లో కేంద్ర పర్యాటక శాఖ తీసుకొచ్చిన స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద.. రూ. 29.88 కోట్లతో బొర్రా గుహలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఇక్కడ అత్యాధునిక లైటింగ్, ఫ్లోరింగ్, ప్రొజెక్ట్ మ్యాపింగ్, సేఫ్టీ రేయిలింగ్స్, పార్కింగ్, విజిటర్స్ ఎమినిటీస్, రెస్టారెంట్స్.. వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఇక రూ. 42.30 కోట్లతో హరిత రిసార్ట్స్ను కూడా అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. మొత్తంగా అరకును అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి దుర్గేశ్ చెప్పారు.
Latest News