|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:33 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బుధవారం రోజున సచివాలయంలో అధికారులతో చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నూతన రైల్వే ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని వివిధ పోర్టుల నుంచి రైల్ కనెక్టివిటీ, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హింటర్ ల్యాండ్ నుంచి రైల్ రవాణాపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. రాయలసీమ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీపై సమీక్షించారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు లైన్లను హై స్పీడ్ రైల్వే కారిడార్లుగా అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, రేణిగుంట, గుంటూరు రైల్వే జంక్షన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించే అంశాలపై చంద్రబాబు సమీక్షించారు. సీఎం చంద్రబాబుతో జరిగిన భేటీలో దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్లకు చెందిన జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులుపాల్గొన్నారు.
మరోవైపు హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు విషయానికి వస్తే.. విజయవాడ హైవే మార్గంలో నిర్మించాలని రైల్వే శాఖ తొలుత ప్రతిపాదించింది. అయితే ఈ ఎలైన్మెంట్ మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరు నెలలో దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్పష్టం చేసింది. ఫ్యూచర్సిటీ- అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే మార్గంలో హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ కారిడార్ రైలు ప్రాజెక్టు ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు స్పష్టం చేశారు. అలాగే హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు ఎలైన్మెంట్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పలు సూచలను చేసింది.
మరోవైపు హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ఏపీ మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. ఇందుకు రూ.1.86 లక్షల కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. అలాగే హైదరాబాద్ - బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లనుంది. ఇందుకు రూ.1.44 లక్షల కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును హైదరాబాద్- శంషాబాద్- నార్కట్పల్లి- సూర్యాపేట- ఖమ్మం -అమరావతి మీదుగా చెన్నై వరకూ రైల్వేశాఖ ప్రతిపాదించింది.
అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం శంషాబాద్ నుంచి మిర్యాలగూడ వైపుగా అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కగా చేపట్టాలని కోరుతోంది. ఇక హైదరాబాద్ - బెంగళూరు హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును.. హైదరాబాద్- శంషాబాద్- మహబూబ్నగర్-వనపర్తి రోడ్ - కర్నూలు-డోన్ -గుత్తి మీదుగా బెంగళూరు వరకూ ప్రతిపాదించారు.
Latest News