|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 08:26 PM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ విమాన ప్రమాద మృతిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రకు పూడ్చలేని నష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా.. జవాబుదారీతనంతో దర్యాప్తు జరిపిస్తుందని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన స్థలానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 8:48 గంటలకు బారామతి విమానాశ్రయం వద్ద విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో వెలుతురు (దృశ్యమానత) చాలా తక్కువగా ఉందని.. ఇదే విమానం ప్రమాదానికి గురి కావడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆ విమాన పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణను.. విమానం కూలిపోయే ముందు జరిగిన క్రమాన్ని ఆయన వివరించారు.
మొదటి ప్రయత్నంలో భాగంగా విమానం బారామతి ఎయిర్పోర్టులో దిగడానికి ముందుగా రన్వే కనిపిస్తుందా అని పైలట్ను ఏటీసీ అడిగిందని.. అయితే రన్వే కనిపించడం లేదని పైలట్ సమాధానం ఇవ్వడంతో.. గో అరౌంట్ కాల్ వచ్చినట్లు తెలిపారు. దీంతో వెంటనే పైలట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా గాలిలోకి తీసుకెళ్లి ఒక రౌండ్ వేశారని.. ఇక రెండో ప్రయత్నంలో విమానం తిరిగి ల్యాండింగ్కు వచ్చినప్పుడు.. రన్వే కనిపిస్తుందా అని మళ్లీ ఏటీసీ అడిగినపుడు.. ఈసారి రన్వే కనిపిస్తోందని పైలట్ ధృవీకరించారని పేర్కొన్నారు. దీంతో ఏటీసీ నుంచి ల్యాండింగ్ అనుమతి లభించిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైనట్లు వివరించారు.
ఈ ఘటనపై స్పందించిన రామ్మోహన్ నాయుడు.. 'అజిత్ దాదా మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రజా సేవలో ఆయనకు ఉన్న అనుభవం మాకెంతో మార్గదర్శకంగా ఉండేది. ఇది మహారాష్ట్రకు తీరని లోటు. ఆయనతో పాటు మరణించిన మరో నలుగురి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని పేర్కొన్నారు.
విమాన ప్రమాదంపై దర్యాప్తు
ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి ఇప్పటికే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరింది. ప్రమాదానికి గురైన విమానంలోని బ్లాక్ బాక్స్ ఆధారంగా సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఈ టీమ్ విచారణ జరపనుంది.
Latest News