|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 02:50 PM
మహారాష్ట్రలోని నాసిక్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడు నెలల క్రితం జరిగిన గొడవను మనసులో పెట్టుకుని కక్ష తీర్చుకునేందుకు ఓ 16 ఏళ్ల బాలుడు బీఎండబ్ల్యూ కారుతో స్కూటర్ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటర్పై వెళ్తున్న ఇద్దరు 14 ఏళ్ల బాలురకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కుమారుడని తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ హోంకు తరలించింది.నాసిక్లోని గంగాపూర్ రోడ్లో ఈ నెల 24న సాయంత్రం 5:30 గంటలకు ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఒకరైన 9వ తరగతి విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు ఏడు నెలల క్రితం కాలేజ్ రోడ్లోని ఓ కాఫీ షాపు వద్ద నిందితుడితో గొడవ జరిగిందని, అప్పుడే తనను వదిలిపెట్టనని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ పగతోనే ఇప్పుడు తమ స్కూటర్ను బీఎండబ్ల్యూ కారుతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడని తెలిపాడు. ఈ ఘటనలో బాధితుడి ముక్కు విరగడంతో పాటు ముఖం, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అతని స్నేహితుడికి కూడా కాళ్లకు గాయాలయ్యాయి."బాలుడు స్కూటర్ను ఢీకొట్టి పారిపోయినప్పటికీ అతడి కారు కంపెనీ, రిజిస్ట్రేషన్ నంబర్ సహా అన్ని వివరాలు ఇవ్వడంతో వెంటనే అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నాం" అని అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నిఖిల్ పవార్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
Latest News