|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:30 PM
భారత్ విషయంలో ఉన్నవీ లేనివీ చెబుతూ అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులపాలవుతోంది దాయాదీ పాకిస్తాన్. చైనా చేసిన ఆర్మీ డ్రిల్ ఫొటోను షేర్ చేస్తూ.. భారత్పై విజయంగా చెప్పుకున్న ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్.. జోకర్లు అని పేరు తెచ్చుకున్నారు. ఇవే కాకుండా అనేక సార్లు పాక్ వక్రబుద్ధిని భారత్ అందరిముందే ఎండగట్టింది. అయినా సిగ్గు తెచ్చుకోలేని ఆ దేశం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉంది. అలా పాకిస్తాన్ చేసిన కామెంట్లకు మరోసారి భారత్ చెంప చెల్లుమనిపించింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న కర్తవ్యపథ్లో జరిగిన 77వ రిపబ్లిక్ డే పరేడ్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అద్భుత విన్యాసాలు చేసింది. భారత వైమానిక శక్తిని, అధునాతన దాడి సామర్థ్యాలను చాటి చెప్పింది. ఈ విన్యాసాలకు సంబంధించిన వీడియోలను ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. అందులో రెండు వీడియోలు ప్రత్యేకంగా నిలిచిచాయి. పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని బట్టబయలు చేశాయి.
పాక్కు చెంప దెబ్బ..
ఐఏఎఫ్ విడుదల చేసిన ఓ వీడియోలో BS-022 టెయిల్ నంబర్ ఉన్న రఫేల్ యుద్ధ విమానం కనిపించింది. అయితే ఇదే యుద్ధ విమానాన్ని ఆపరేషన్ సింధూర్లో సమయంలో తమ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసినట్లు పాక్ పిచ్చికూతలు కూసింది. ఈ ఆపరేషన్ సమయంలో భారత్ రఫేల్ యుద్ధవిమానాలను, S-400 డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామనే పాకిస్తాన్ తప్పుడు వార్తలు ప్రచారం చేసింది. ఐఏఎఫ్ విడుదల చేసిన వీడియోలు.. పాకిస్తాన్ ప్రచారం చేసిన ఫేక్ వార్తలను పటాపంచలు చేశాయి. కాగా, తమ రఫేల్ జెట్లలో దేనికీ ఎలాంటి నష్టం జరగలేదని భారత్ అప్పట్లోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఎస్-400 కూల్చాం..: పాక్
కాగా, గతంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి ఒకరు.. భారత్కు చెందిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ గురించి వివరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో ఎస్-400 మిసైల్ సిస్టమ్ను ఆ అధికారి.. సెంటర్ ఆఫ్ గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) అని పేర్కొన్నట్లు ఉన్న వీడియో నెట్టింట హల్చల్ చేసింది. భారత ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థను గుర్తించడం సులభం కాదని వివరించేందుకు ప్రయత్నించిన ఆ అధికారి నవ్వులపాలయ్యారు. అంతేకాకుండా ఎస్-400ను గుర్తించడం కంటే.. వాటిపై దాడి చేయడం సులభం అని చెప్పారు. దీంతో అతడికి ఉన్న అవగాహనపై సోషల్ మీడియాలో జోలుకు పేలాయి.