|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 11:08 PM
రౌండ్ 1లో వేలానికి వచ్చి అన్సోల్డ్గా మిగిలిపోయిన మాన్స్టర్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్కు యాక్సలరేటెడ్ రౌండ్లో మంచి డిమాండ్ వచ్చింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలానికి వచ్చిన లివింగ్స్టోన్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఆసక్తి చూపింది. తొలుత గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ సన్రైజర్స్తో పోటీ పడగా.. ఆ తర్వాత సంజీవ్ గోయెంకా లివింగ్స్టోన్ ధరను అమాంతం పెంచేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన కావ్య మారన్ భారీ ధరకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో లియామ్ లివింగ్స్టోన్ రూ. 13 కోట్ల ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ పర్స్లో ఉన్న డబ్బులతో చివరి వరకు బిడ్డింగ్ చేసింది. కానీ లివింగ్స్టోన్ కోసమే ఎదురుచూస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 13 కోట్లకు సొంతం చేసుకుంది. దాంతో తొలి రౌండ్లో అన్సోల్డ్గా మిగిలిపోయిన లియామ్ లివింగ్స్టోన్కు మంచి ధరే వచ్చింది.
కావ్య మారన్ ఆసక్తి చూసిన సంజీవ్ గోయెంకా కావాలనే లివింగ్స్టోన్ ధరను పెంచుతూ వెళ్లాడు. ఒకానొక దశలో కావ్య మారన్ తన చేతిలో ఉన్న బిడ్ పోస్టర్ను దించకుండా అలానే ఉంచింది. దాంతో గోయెంకా కావాలనే తమ పర్స్లో ఉన్నంత వరకు బిడ్ చేస్తూ వెళ్లాడు. మిగతా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవడం, వాళ్ల పర్స్లో అంత మనీ లేకపోవడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ లివింగ్స్టోన్ను దక్కించుకుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్ అత్యధికంగా రూ. 25.20 కోట్లు పలికాడు. ఓవర్సీస్ ప్లేయర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గ్రీన్ నిలిచాడు. గ్రీన్ తర్వాత మతీషా పతిరణ రూ. 18 కోట్లు పలకాడు. ఈ ఇద్దర్నీ కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ రూ. 14.2 కోట్లు ధర పలికి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత లియామ్ లివింగ్స్టోన్ రూ.13 కోట్లు పలకడం విశేషం.
మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ లియామ్ లివింగ్స్టోన్ మినహా మిగతా అందర్నీ అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లనే సొంతం చేసుకోవడం విశేషం. సన్రైజర్స్ సొంతం చేసుకున్న ఆటగాళ్ల వీళ్లే.. లియామ్ లివింగ్స్టోన్, సలీల్ అరోరా, క్రైన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింజే, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, షాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్.
Latest News