|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:26 PM
నేషనల్ హెరాల్డ్ కేసులో.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన తాజా ఎఫ్ఐఆర్పై విచారణను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఈడీ దర్యాప్తు జరిగిందే తప్ప.. ఎఫ్ఐఆర్ ఆధారంగా కాదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ దశలో నిందితులైన కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు వెల్లడించింది. అయితే ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించడానికి ఈడీకి అనుమతినిచ్చింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన తాజా ఎఫ్ఐఆర్కు సంబంధించిన విచారణపై అంగీకారం తెలిపేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అంగీకరించలేదు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఒక ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ సమన్ల ఆదేశాల ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసిందని.. ఎఫ్ఐఆర్ ఆధారంగా కాదని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.
కేసు విచారణ దశలో ఉండటంతో.. రాహుల్ గాంధీ , సోనియా గాంధీ సహా ఇతర నిందితులు ఎఫ్ఐఆర్ కాపీని పొందేందుకు అర్హులు కారని కోర్టు చెప్పింది. అయితే ఈడీ అధికారులు మాత్రం దర్యాప్తు కొనసాగించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఈడీపై, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. తమ అగ్రనేతలపై ఈడీ చేపట్టిన చర్యలు రాజకీయ ప్రేరితమైనవవని.. అవి చట్టబద్ధంగా నిలబడలేనివని పేర్కొంది. ఈడీ చర్యలకు అధికార పరిధి లేదని కోర్టు గుర్తించిందని.. ఎందుకంటే అలాంటి విచారణలకు తప్పనిసరి అయిన ఎఫ్ఐఆర్ లేదని కాంగ్రెస్ వాదించింది.
ఈ క్రమంలోనే సత్యమే గెలిచిందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. మోదీ ప్రభుత్వ దురుద్దేశం, చట్టవిరుద్ధం పూర్తిగా బహిర్గతమైందని.. యంగ్ ఇండియన్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం, దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని కోర్టు గుర్తించిందని హస్తం పార్టీ ఆ పోస్ట్లో తీవ్ర ఆరోపణలు చేసింది.
దీనిపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేశారు. ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైన 2008 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలో లేరని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని.. వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామమని తెలిపారు. చట్టం తన పనిని తాను చేసుకుపోనివ్వండి అంటూ రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై క్రిమినల్ కుట్ర (సెక్షన్ 120(B)), మోసం (సెక్షన్ 420) కింద అభియోగాలు మోపినట్లు ఆయన గుర్తు చేశారు.
Latest News