|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:25 PM
గోవాలోని నైట్క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ యజమానులు.. గౌరవ్, సౌరభ్ లూత్రాలకు ఎట్టకేలకు చుక్కెదురైంది. ప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి పారిపోయిన ఈ సోదరులను భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు థాయ్లాండ్ పోలీసులు పట్టుకుని.. మంగళవారం రోజు భారత్కు పంపించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్న వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రమాదం తర్వాత థాయ్లాండ్కు పలాయనం
ఈనెల 6వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత గోవాలోని అర్పోరాలోని 'బిర్చ్ బై రోమియో' నైట్క్లబ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే క్లబ్ యజమానులైన లూత్రా సోదరులు ఇండిగో విమానంలో థాయ్లాండ్లోని ఫుకెట్కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. గోవా పోలీసులు వెంటనే వారిపై కేసు నమోదు చేసి.. పాస్పోర్టులను రద్దు చేశారు. అలాగే ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసులను జారీ చేశారు. దీంతో విదేశాలలో వారి ప్రయాణం ఆగిపోయింది.
పుకెట్లో అరెస్ట్, ఢిల్లీకి తరలింపు..
భారత అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు థాయ్లాండ్ పోలీసులు ఇటీవల లూత్రా సోదరులను పుకెట్లో గుర్తించి అరెస్టు చేశారు. వారి గుర్తింపు, ప్రయాణ వివరాలను ధ్రువీకరించుకున్న తర్వాత.. అంటే మంగళవారం రోజు ఉదయం వారిని ఇండిగో విమానంలో భారత్కు డిపోర్ట్ చేశారు. ఈక్రమంలోనే మధ్యాహ్నం 1.45 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న లూత్రా సోదరులను.. గోవా పోలీసులు వెంటనే కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రస్తుతం వారిని విచారణ నిమిత్తం గోవాకు తరలించడానికి ట్రాన్సిట్ రిమాండ్లో ఉంచినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అన్ని న్యాయ ప్రక్రియలు పూర్తయిన తర్వాత అంటే బుధవారం లూత్రా సోదరులను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పారిపోయిన నిందితులు తిరిగి రావడంతో.. ఈ కేసులో తదుపరి విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.