|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 11:22 PM
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని, ఉద్యోగాలు చేయాలని, అక్కడే నివాసం ఏర్పరుచుకుని అమెరికా పౌరుడిగా జీవించాలని ఎన్నో దేశాలకు చెందిన విద్యార్థులు కలలు కంటుంటారు. అందుకోసం ఎంతగానో కష్టపడి చదువుతూ, లక్షల్లో డబ్బులు చెల్లిస్తూ మరీ అమెరికాకు వెళ్తుంటారు. అచ్చంగా ఇదే భావనతో వెళ్లాలనుకునే వారందరికీ అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి అక్కడి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. డిసెంబర్ 15వ తేదీ సోమవారం అంటే ఈరోజు నుంచే వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలన ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ నిర్ణయం ప్రధానంగా భారతీయ నిపుణులకు ఉపయోగపడే హెచ్-1బీ, హెచ్-4 వీసాలతో పాటు విద్యార్థులకు సంబంధించిన ఎఫ్ (F), ఎం (M), ఎక్స్ఛేంజ్ విజిటర్లకు సంబంధించిన జే (J) వీసాల దరఖాస్తుదారులకు వర్తిస్తుంది. అయితే విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. సోమవారం (డిసెంబర్ 15) నుంచి వీసా దరఖాస్తుదారుల 'ఆన్లైన్ ఉనికి'ని సమీక్షించే ప్రక్రియ మొదలవుతుంది. ఈ 'వెట్టింగ్' ప్రక్రియకు సహకరించే విధంగా.. హెచ్-1బీ, హెచ్-4తో సహా అన్ని వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా సెట్టింగ్లను 'ప్రైవేటు' నుంచి 'పబ్లిక్'కు మార్చుకోవాలని విదేశాంగ శాఖ సూచించింది.
ఇదీ చూడండి: అమెరికాలో 85 వేల వీసాలు రద్దు.. విద్యార్థులు సహా వేలాది మందికి షాక్
జాతీయ భద్రతే ప్రధానం
ప్రతి వీసా నిర్ణయం కూడా జాతీయ భద్రత కోణంలోనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. "అమెరికాలోకి ప్రవేశించే వ్యక్తులు అమెరికన్లకు హాని కలిగించబోరని, దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించబోరని మేము విశ్వసించాలి. అందుకే వీసా దరఖాస్తుదారులు తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలి" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీసా జారీ ప్రక్రియలో అత్యంత జాగ్రత్తగా ఉంటామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.
సోషల్ మీడియా పరిశీలన అనే కొత్త నిబంధనల నేపథ్యంలో.. ఇప్పటికే పలు హెచ్-1బీ వీసాల ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు సమాచారం. ఈ క్షుణ్ణమైన వెట్టింగ్ కారణంగా వీసా జారీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్, పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. ఏదేమైనా ఈ కొత్త నిబంధన అమెరికా వీసా ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థులు, వారి కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
Latest News