|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 09:03 PM
దేశంలో గ్రామీణ ఉపాధి హామీ విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు కొత్త బిల్లును ప్రభుత్వం లోక్సభ సభ్యులకు సర్క్యులేట్ చేసింది. గ్రామీణ ఉపాధి హామీ కోసం 2005లో రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి.. దాని స్థానంలో 'వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు 2025'ను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
కొత్త చట్టంలో.. 125 రోజుల పని హామీ
2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) జాతీయ లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణాభివృద్ధి ఫ్రేమ్వర్క్ను స్థాపించడం ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ కొత్త చట్టం ప్రకారం.. గ్రామీణ కుటుంబంలో నైపుణ్యం లేని పనులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజనులకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీ లభించనుంది. (ప్రస్తుత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కంటే 25 రోజులు ఎక్కువ). ఈ చట్టం ముఖ్య ఉద్దేశం "శక్తిని, వృద్ధిని, సమన్వయాన్ని, సంతృప్తిని" ప్రోత్సహించి సంపన్నమైన, సుస్థిరమైన గ్రామీణ భారతాన్ని నెలకొల్పడం.
ఈ బిల్లు లోక్సభ సభ్యులకు సర్క్యులేట్ అయింది. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధికి హామీని ఇచ్చే నరేగా చట్టాన్ని 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఆ తర్వాత 2009 అక్టోబర్ 2 నుంచి ఈ చట్టాన్నిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గా పేరు మార్చారు. దేశంలోని పేద ప్రజలకు కనీస ఉపాధిని అందించడంలో ఈ చట్టం కీలక పాత్ర పోషించింది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ చట్టం స్థానంలో కొత్త బిల్లు రావడం దేశ ఆర్థిక విధానంలో ఒక ముఖ్యమైన మార్పుగా పరిగణించబడుతోంది.
Latest News