|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 01:22 PM
ఏపీలో మోడల్ పోలీస్టేషన్ల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తిగా నిలిచిపోయిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. 2019కి ముందు తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మోడల్ పోలీస్టేషన్లనే గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తనను అరెస్టు చేసి అలాంటి ఒక స్టేషన్లోనే కూర్చోబెట్టారని ఆమె గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ మోడల్ పోలీస్టేషన్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని స్పష్టం చేశారు.సోమవారం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే) బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.509 కోట్లతో పలు భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే రూ.179 కోట్లతో కొత్త నిర్మాణాలు, రూ.412 కోట్లతో గ్రేహౌండ్స్ భవనాల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు.ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేతిలో సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కార్యాలయాలు లేవని, వాటి నిర్మాణాలపై దృష్టి సారిస్తామన్నారు. కొత్త ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఎండీ రవిప్రకాశ్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.
Latest News