|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 10:45 PM
భారతదేశంలో నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే.. దానికి అనుగుణంగా పన్ను శ్లాబుల కింద పాత లేదా కొత్త పన్ను విధానాల్ని బట్టి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇందుకోసం కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబిస్తున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా నకిలీ విరాళాల పేరుతో పన్ను ఎగవేతకు పాల్పడుతున్నటువంటి పన్ను చెల్లింపుదారులపై ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. టాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మధ్యవర్తులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏజెంట్ నెట్వర్క్లను ఏర్పాటు చేసి.. గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీలు సహా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాల పేరిట తప్పుడు క్లెయిమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది.
ఎక్కువగా ఈ మోసపూరిత క్లెయిమ్స్ సెక్షన్ 80G, సెక్షన్ 80GGC కింద నమోదవుతున్నాయి. ఇలా తప్పుడు మార్గాల్లో బోగస్ క్లెయిమ్స్ అనేవి రిఫండ్స్ క్లెయిమ్ కోసం అప్లై చేసినప్పుడు బయటపడ్డాయి. తనిఖీల్లో చూస్తే.. ఎన్నో గుర్తింపు లేని రాజకీయ పార్టీలు వాస్తవానికి ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనట్లేదని.. ఇవి లెక్కలోకి రాని డబ్బును మార్చేందుకు.. హవాలా లావాదేవీలకు, తప్పుడు రశీదుల్ని జారీ చేసేందుకే ఉపయోగపడుతున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుర్తించింది.
>> విరాళాల మొత్తంలో ఈ పార్టీలు దాదాపుగా 4.5 శాతం నుంచి 5 శాతం వరకు కమిషన్ రూపంలో తీసుకొని.. మిగతా మొత్తం దాతలకు తిరిగి ఇచ్చేస్తుందని తెలిసింది. ఇదో పెద్ద మోసంగా తయారవుతోందని ఐటీ శాఖ గుర్తించింది. ఇక్కడ ఇలాంటి తప్పుడు క్లెయిమ్స్ను ముందస్తుగానే గుర్తించేందుకు ఐటీ శాఖ.. తన ప్రత్యేక డేటా అనలిటిక్స్ విభాగం ఆధారిత నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.
టాక్స్పేయర్లు క్లెయిమ్ చేసినటువంటి వాటిల్లో ఎక్కువగా అనుమానాస్పద సంస్థలకు విరాళాలుగానే ఉన్నట్లు ఈ డేటా విశ్లేషణలో తెలిసింది. ఇంకా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే ముందు ఐటీ శాఖ.. తమ తప్పుల్ని సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తూ గతేడాది నడ్జ్ క్యాంపెయిన్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ దాఖలు చేసిన వారికి నోటీసులు పంపి.. లెక్కల్లోకి రాని వేల కోట్ల ఆదాయం మళ్లీ రివైజ్డ్ రిటర్న్స్లో పేర్కొనేలా చేసింది. దీంతో చాలా మంది జరిమానాలు, ఇతర చట్టపర చర్యల నుంచి తప్పించుకోగలిగారు.
ఈ నడ్జ్ క్యాంపెయిన్ సెకండ్ ఫేజ్ ఇటీవల డిసెంబర్ 12న ప్రారంభమైంది. దీని కింద అనుమానిత పన్ను చెల్లింపుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్స్కు ఎస్ఎంఎస్, అలాగే ఇ- మెయిల్స్ను నోటీసుల రూపంలో పంపిస్తోంది. తప్పుడు క్లెయిమ్ ఉపసంహరించుకొని.. మళ్లీ సరైన వివరాలతో ఐటీఆర్ అప్డేట్ చేయాలని సూచిస్తోంది.