|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:44 PM
ఆస్ట్రేలియాలో దుండుగులు రెచ్చిపోయారు. ప్రముఖ బీచ్లో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. సిడ్నీలోని బాండీ బీచ్లో జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది పర్యాటకులు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మొత్తం 50 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమవ్వగా.. మరొకర్ని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కాల్పులతో పర్యాటకుల హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ప్రశాంతంగా ఉన్న బీచ్లో ఒక్కసారిగా బీతావాహ పరిస్థితి నెలకుంది.
ఈ కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆయన అన్నారు. ఘటనా స్థలిలో బాధితులను రక్షించేందుకు పోలీసులు, అత్యవసర సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
‘‘ఏఎఫ్పీ కమిషనర్, న్యూసౌత్వేల్స్ ప్రీమియర్లతో మాట్లాడాను.. మేము స్థానిక పోలీసులతో కలిసి పనిచేస్తున్నాం.. మరిన్ని వివరాలను ధ్రువీకరించిన అనంతరం తదుపరి సమాచారం అందిస్తాం... పోలీసుల సూచనలను ప్రజలు పాటించాలి’ అని ఆంథోనీ ఆల్బనీస్ ఓ ప్రకటనలో తెలిపారు.
బాండీ బీచ్లో ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించామని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపారు. ‘అక్కడ ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కాల్పులు జరిపిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పోలీసులిచ్చే అన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఎనిమిది రోజుల పాటు కొనసాగే యూదుల పండుగ హనుక్కా మొదటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటల తర్వాత యూదుల పండుగ ఆరంభాన్ని గుర్తిస్తూ బీచ్లో వందలాది మంది చేరిన సమయంలోనే దుండగులు కాల్పులు ప్రారంభించారు. పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఘటనపై ప్రతిపక్ష నాయకురాలు సుసాన్ లే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మనమంతా ఏంతో ఇష్టపడే బాండీలో జరిగిన విద్వేషపూరిత హింసతో యావత్తు దేశం శోకంలో మునిగిపోయిందని వాపోయారు.
Latest News