|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:25 PM
ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ‘ఓట్ చోరీ’పై ఢిల్లీలోని చరిత్రాత్మక రామ్లీలా మైదానంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ డిసెంబరు 14న (ఆదివారం) భారీ నిరసన చేపట్టింది. అయితే, ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన వివాదాస్పద నినాదాలపై బీజేపీ స్పందిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అంతం చేయడమే ఆ పార్టీ ప్రధాన లక్ష్యమని మండిపడింది. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన కార్యకర్తలు.. ఆయన పాలన త్వరలోనే ముగిసిపోతుందని అనడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో ఉంది.
దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ.. ‘కాంగ్రెస్ ఎజెండా స్పష్టమైంది.. ఆ పార్టీ యుద్ధం ఎస్ఐఆర్పై కాదు రాజ్యాంగంపైనే.. ఎస్ఐఆర్ పేరుతో ప్రధాని మోదీని అంతం చేయాలని చూస్తున్నారు.. ఇటీవల ఎన్నికల సంఘాన్ని రాహుల్ గాంధీ బెదిరించారు.. ఇప్పటి వరకూ 150సార్లకుపైగా మోదీని కాంగ్రెస్ అవమానించింది’ అని ఆరోపించారు.
అలాగే, బీజేపీకి చెందిన మరో అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడుతూ.. మా నాయకుడ్ని అవమానిస్తే ప్రజలు సహించబోరని వార్నింగ్ ఇచ్చారు. ‘కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలను నేను వ్యక్తిగతంగా వినలేదు కానీ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తాను.. ఒకవేళ అటువంటి నివాదాలు చేసుంటే ప్రజల మనోభావాలను కాంగ్రెస్ ఇంకా అర్ధం చేసుకోలేనట్టే. ప్రధాని మోదీ, ఆయన కుటుంబంపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ ప్రజలు వారిని ఛీకొట్టారు’ అని సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు.
పార్లమెంట్లో ఎస్ఐఆర్పై చర్చ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేపట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఎద్దేవా చేశారు. ‘సభలో ప్రతి ఒక్క సభ్యుడూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే.. హోమ్ మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఓట్ చోరీ గుర్తుకురాలే.. బీజేపీ గెలిస్తే మాత్రం ఓట్ల చోరీ జరిగింది అంటున్నారు.. చొరబాటుదారుల గురించి అమిత్ షా ప్రస్తావిస్తే సభ నుంచి వాకౌట్ చేశారు.. అంటే చొరబాటుదారులను కాపాడటానికే కాంగ్రెస్ ర్యాలీ చేస్తోందని స్పష్టమవుతోంది’ అని విమర్శించారు. అయితే, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఇప్పటి వరకూ స్పందించలేదు.