|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:42 PM
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి గురించి కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో జరగాల్సిన తన పెళ్లి రద్దు అయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పెళ్లి రద్దు విషయం వెల్లడించింది. వారాల తరబడి నెలకొన్న ఊహాగానాలపై స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది. పెళ్లి రద్దు అయినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఆమె అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను కాపాడాలని ఆమె సూచించింది.
''గత కొన్ని వారాలుగా నా వ్యక్తిగత జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి రద్దు అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ కూడా ఇలాగే చేయండి. ఇక్కడితో ఈ విషయంపై చర్చను ఆపేయండి. ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్ తరపున ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. నా దృష్టి అంతా క్రికెట్పైనే ఉంటుంది, దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నా ప్రధాన లక్ష్యం. నేను వీలైనంత కాలం టీమిండియా తరఫున ఆడాలని, ట్రోఫీలను గెలవాలని ఆశిస్తున్నాను. నా దృష్టి ఎల్లప్పుడూ దానిపైనే ఉంటుంది. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ థాంక్స్. ఇక ముందుకు సాగాల్సిన టైమ్ వచ్చింది” అని స్మృతి మంధాన సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
కాగా మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్, స్మృతి మంధానల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పలాష్ ముచ్చల్ సైతం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి.
అయితే పెళ్లి విషయంలో మంధాన మనసు మార్చుకున్నారని.. పెళ్లి రద్దు చేసుకున్నారని రెండు, మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె కూడా ఇన్స్టాలో పెళ్లికి ముందు పోస్టు చేసిన ఫొటోలను డిలీట్ చేసింది. అంతేకాకుండా శుక్రవారం స్మృతి పోస్ట్ చేసిన ఒక బ్రాండ్ ప్రమోషనల్ వీడియోలో ఆమె చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించలేదు. దీంతో ఆమె పెళ్లి రద్దు అయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై మంధాన అధికారిక ప్రకటన చేశారు.
Latest News