|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 07:21 PM
ఏపీ లారీ యజమానుల సంఘం ఆందోళన బాట పట్టింది. వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా.. డిసెంబర్ 9 నుంచి షిప్ యార్డులు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని ఏపీ లారీ ఓనర్ల సంఘం హెచ్చరించింది. 13 ఏళ్లు దాటిన వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులను కేంద్రం ఇటీవల పెంచింది. ఆ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఫీజులను తగ్గించాలని లారీ యజమానులు కోరుతున్నారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నారు. నోటిఫికేషన్ నిలుపుదల చేయకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచి షిప్ యార్డులు, రైల్వే షెడ్లలో గూడ్స్ రవాణా నిలిపివేస్తామని హెచ్చరించారు.
మరోవైపు వాహనాల టెస్టింగ్, ఫిట్నెస్ ఫీజులపై కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు ఉందని.. లారీ ఓనర్ల సంఘం చెప్తోంది. 13 ఏళ్లు దాటిన పాత వాహనాలపై ఫీజులను భారీగా పెంచడం సరికాదని.. దీనివలన గూడ్స్ రవాణా చేసే వాహనాల యజమానులపై పెనుభారం పడుతుందని లారీ ఓనర్ల సంఘం వాదిస్తోంది. నోటిఫికేషన్ నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు.. దీనిపై నిర్ణయం తీసుకోవాలని లారీ ఓనర్ల సంఘం కోరింది. లేని పక్షంలో రాష్ట్రంలోని 10వేల గూడ్స్ లారీలు నిలిపివేస్తామని హెచ్చరించింది. తమపై భారం పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని లారీ ఓనర్ల సంఘం కోరింది.
మరోవైపు సరుకు రవాణా ఆగిపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా రంగం అత్యంత కీలకమైంది. రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగితే..ఆహార ధాన్యాలు, పాలు వంటి నిత్యావసరాల సరఫరా ఆగిపోతుంది. దీంతో మార్కెట్లో కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సరఫరా తగ్గటంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి.. ధరలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాగే పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే ముడిసరుకులు రవాణా నిలిపిపోతే.. పారిశ్రామిక కార్యకలాపాలకు కూడా ఆటంకం కలగవచ్చు. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా వ్యవస్థ అత్యంత కీలకంగా భావించవచ్చు. అయితే షిప్ యార్డులు, రైల్వే షెడ్ల నుంచి గూడ్స్ రవాణా నిలిపివేస్తామని లారీ ఓనర్ల సంఘం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
Latest News