|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:20 AM
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న నిర్వహణ సంక్షోభం పరిష్కారం అంచున ఉందని, సంస్థపై చర్యలు తీసుకోవడం ఖాయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ ఇండిగో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఆయన హెచ్చరించారు.శుక్రవారం ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయని, ఇతర విమానయాన సంస్థలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని పాటిస్తున్నాయని గుర్తుచేశారు. కేవలం ఇండిగో మాత్రమే సమస్యలు ఎదుర్కోవడం చూస్తుంటే, తప్పు పూర్తిగా ఆ సంస్థదేనని స్పష్టమవుతోందన్నారు.ఇతర ఎయిర్లైన్స్కు లేని సమస్య ఇండిగోకు మాత్రమే ఎందుకు వచ్చింది కాబట్టి లోపం ఎక్కడుందో స్పష్టంగా తెలుస్తోంది" అని మంత్రి పేర్కొన్నారు.ప్రయాణికుల కష్టాలు ఎప్పుడు తీరుతాయని ప్రశ్నించగా "సమస్య దాదాపు పరిష్కారమైంది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. శనివారం నుంచి ఇండిగో పాక్షిక సామర్థ్యంతో సేవలు ప్రారంభిస్తుంది. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయి" అని ఆయన హామీ ఇచ్చారు.ఇండిగో వైఫల్యంపై విచారణకు ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ప్రయాణికుల ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Latest News