|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 08:03 PM
రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉండగా.. కొన్నేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఆ తర్వాత నుంచి పిల్లలను చూసుకుంటూనే జీవితం గడుపుతున్న ఈమెకు మరో వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా తరచుగా వీరిద్దరూ కలుస్తుండగా.. భర్త తరఫు బంధువులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈక్రమంలోనే వారిద్దరూ ఏకాంతంగా కలిసుండగా.. చుట్టాలు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోతూ.. వీరిద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదివేయాల్సిందే.
అసలేం జరిగిందంటే?
రాజస్థాన్కు చెందిన సోనికి చాలా ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పదేళ్ల కొడుకుతో పాటు ఏడేళ్ల కుమార్తె కూడా ఉండగా.. ఆరేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. అయితే అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటూ పిల్లలను చూసుకుంటూ వస్తోంది. అయితే ఏడాది క్రితం నుంచి ఆమెకు కైలాష్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అతడికి కూడా పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అవేమీ పట్టించుకోని సోని అతడితో ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ ఏకాంతంగా కలుస్తూ.. చాలా రోజులుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రుళ్లు తమ కోరికను తీర్చుకుంటూ.. మళ్లీ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోతున్నారు.
అయితే ఎప్పటిలాగే శుక్రవారం రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో సోని.. కైలాష్ను కలవడానికి వెళ్లింది. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడుపుతున్నారు. అయితే అప్పటికే ఈమె వ్యవహారం గురించి తెలుసుకున్న భర్త తరఫు బంధువులు ఆమెను వెంబడించారు. ఆమె కంటపడకుండా వెనకాలే వెళ్లారు. ప్రియుడితో సోని ఏకాంతంగా గడుపుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తీవ్ర ఆగ్రహావేశానికి లోనవుతూ.. వారిద్దరినీ జంటగా కట్టి పడేశారు. ఆపై వెంట తెచ్చుకున్న పెట్రోల్ వారిద్దరి మదీ పోసి నిప్పంటించారు. ఆపై అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. వీరి కేకలు విన్న స్థానికులు.. వెంటనే వారి వద్దకు వచ్చారు.
అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ దాడిలో కైలాష్కు 70 శాతం, సోనికి 90 శాతం కాలిన గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కైలాష్ సోమవారం రాత్రి మరణించగా.. సోని బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించినట్లు ఎస్ఎంఎస్ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. మోఖంపుర పోలీసులు మొదట హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కైలాష్, సోని మరణంతో ఆ అభియోగాలను హత్యగా మార్చారు. దాడి జరిగిన 12 గంటల్లోపే పోలీసులు ప్రధాన నిందితులు బిర్ది చంద్, గణేష్ గుర్జర్లను అరెస్టు చేశారు.
అయితే ఈ దాడిలో మరికొంత మంది వ్యక్తులు పాల్గొన్నారని, వారిని కూడా వెంటనే అరెస్టు చేయాలని బాధితుల కుటుంబం డిమాండ్ చేస్తోంది. కైలాష్ మరణించిన తర్వాత మంగళవారం రోజు గ్రామస్థులు మోఖంపుర–బిచూన్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న అందరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయగా.. అధికారులు వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అసలు వీరిని చంపడానికి వివాహేతర సంబంధమే కారణమా?
అయితే వీరిద్దరి హత్యకు వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే కారణం ఒక్కటి మాత్రమే కాదని తెలుస్తోంది. ముఖ్యంగా గతేడాది సోని బావమరిది కొడుకు.. కైలాష్ సోదరుడి కూతురు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కారణంగా ఇరు కుటుంబాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయినా వీరిద్దరూ సంబంధం కొనసాగించడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన బంధువులు ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. చూడాలి మరి వీరి హత్యకు అసలు కారణం ఏంటనేది.
Latest News