|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:25 PM
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ శుభవార్త చెప్పింది. కేంద్ర సాయుధ బలగాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను డిసెంబరు 1న సోమవారం విడుదల చేసింది. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోరెన్స్, సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్సెస్ (ఎస్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్లో రైఫిల్మెన్ (గ్రౌండ్ డ్యూటీ) విభాగాల్లో మొత్తం 25,487 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ/పీఎస్టీ), మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఎస్ఎస్సీ తెలిపింది.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఆన్లైన్లో కొనసాగుతుంది. 2026 జనవరి 1 అర్ధరాత్రి 11.59 గంటల వరకు వరకు ఫీజు చెల్లించుకోడానికి అవకాశం ఉందని తెలిపింది. దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు జనవరి 8 నుంచి 10వ వరకు అవకాశం కల్పించనున్నట్టు పేర్కొంది. నియామకాలకు సంబంధించిన రాత పరీక్షలు 2026 ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్యలో జరిగే అవకాశం ఉన్నట్లు వివరించింది.
అలాగే, లింగ సమానత్వాన్ని పాటించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నామని, వారికి ప్రత్యేకంగా పోస్టులను కేటాయించినట్టు ఎస్ఎస్సీ స్పష్టం చేసింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. విభాగాల వారీగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 616, సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) 14,595, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) 5490, సశస్త్ర సీమ బల్(ఎస్ఎస్బీ) 1764, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్సెస్ (ఐటీబీపీ) 1293, అస్సాం రైఫిల్స్ (ఏఆర్) 1706తో పాటు సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) కలిపి మొత్తం 25,487 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్ -3 ప్రకారం రూ.21,700- రూ.69,100వరకు వేతనం లభించనుంది. రాత పరీక్షను మొత్తం 160 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు (జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లేదా హిందీ) ఒక్కొక్కటి 20 చొప్పున 80 ప్రశ్నలు మొత్తం 160 మార్కులు.
Latest News