|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:20 PM
మనిషిని పోలిన మనుషులు ఉంటారు అంటారు. ఇక ఒకే పేరు పెట్టుకున్న వారు కూడా చాలా మందే ఉంటారు. మరోవైపు.. ఇంటి పేరు, వ్యక్తి పేరు కూడా మొత్తం సేమ్ ఉండేవారిని కూడా మనం చూసే ఉంటాం. అయితే కొన్నిసార్లు ఇలా ఇద్దరికీ ఒకే పేర్లు ఉండటం చాలా గందరగోళానికి దారితీస్తూ ఉంటుంది. పైగా రాజకీయాల్లో పోటీ చేసే వారికి ఇలా ఒకే పేరు ఉంటే.. అటు పార్టీ వర్గాలు, ఇటు ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారు. తాజాగా సోనియా గాంధీ పేరు కలిగిన ఓ మహిళ.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం.. కేరళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ నగర పంచాయతీ ఎన్నికల్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేరుతో ఉన్న మహిళ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి దివంగత దురైరాజ్.. నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానంతో దురైరాజ్.. తన కుమార్తెకు సోనియా గాంధీ పేరు పెట్టారు. అయితే ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత.. ఈ సోనియా గాంధీ మాత్రం బీజేపీలో చురుకుగా ఉంటూ పంచాయతీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న సుభాష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
ఇక తన భర్త సుభాష్ ప్రోత్సాహంతో సోనియా గాంధీ తన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం బీజేపీ తరఫున కమలం గుర్తుపై నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక ఈ సోనియా గాంధీ వ్యవహారం.. అదే వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్తో పాటు, హస్తం పార్టీ శ్రేణులు ఈ పరిణామంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకే పేరు ఉండటం వలన ఓటర్లు గందరగోళానికి గురై.. ఓట్లు చీలిపోతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం.. పంచాయతీ ఫలితాలను ప్రభావితం చేస్తుందేమోనని వారు భయపడుతున్నారు.
Latest News