|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 09:15 PM
విశాఖవాసులకు పండగలాంటి వార్త. రెండు నెలల వ్యవధిలో వరుసగా నాలుగు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశం వారికి దక్కుతోంది. ఇటీవల మహిళల ప్రపంచకప్ మ్యాచులు చూసి ఎంజాయ్ చేసిన వైజాగ్ వాసులు మరోసారి క్రికెట్ సందడిలో తడిసి ముద్దవనున్నారు. ఇక మ్యాచ్ల విషయానికి వస్తే పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్లతో పాటుగా.. మహిళల క్రికెట్ జట్టు మ్యాచ్లకు కూడా విశాఖపట్నంలోని ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
విశాఖలో జరిగే మ్యాచ్ల వివరాలు..
ప్రస్తుతం భారత్ - దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా మూడో వన్డేకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ ఆరో తేదీన శనివారం టీమిండియా - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే విశాఖలో జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 21వ తేదీన భారత్, శ్రీలంక మహిళల క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత్ , శ్రీలంక మహిళల టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ డిసెంబర్ 21న జరగనుంది. అలాగే డిసెంబర్ 23వ తేదీన రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఇవి పూర్తైన తర్వాత జనవరిలో మరోసారి టీమిండియా వైజాగ్ రానుంది. భారత్ న్యూజిలాండ్ టీ20 సిరీస్లో భాగంగా జనవరి 26న జరిగే నాలుగో టీ20కి విశాఖపట్నం వేదిక కానుంది.
మొత్తంగా రెండు నెలల వ్యవధిలో నాలుగు ఇంటర్నేషనల్ మ్యాచ్లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుండటంతో క్రికెట్ ప్రేమికులు ఫుల్ ఖుషిలో ఉన్నారు. మరోవైపు విశాఖలో ఐపీఎల్ మ్యాచ్లు కూడ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సెకండ్ హోమ్ గ్రౌండ్గా విశాఖను ఎంచుకోవటంతో అప్పట్లో కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ జరిగాయి.
డిసెంబర్ 6 - భారత్, దక్షిణాఫ్రికా వన్డే
డిసెంబర్ 21 - భారత్, శ్రీలంక టీ20 మ్యాచ్ ( మహిళలు)
డిసెంబర్ 23 - భారత్ , శ్రీలంక టీ20 మ్యాచ్ (మహిళలు)
జనవరి 26 - భారత్, న్యూజిలాండ్ టీ20 మ్యాచ్
Latest News