|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 08:29 PM
సాధారణంగా ప్రైవేటు ఉద్యోగాలు అంటేనే టార్గెట్లు, పని ఒత్తిళ్లు, పై అధికారుల తిట్లు, చీవాట్లు ఉంటాయి. ఇక ఉద్యోగుల శ్రమను దోచుకుని.. వారికి సరిగా జీతం, సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే కంపెనీలే ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగుల కష్టం మీద కోట్ల రూపాయలు సంపాదించే కంపెనీలు.. వారి కోసం మాత్రం ఏమాత్రం ఆలోచించవు. అయితే అన్ని కంపెనీలు మాత్రం అలా ఉండవు. కొన్ని కంపెనీలు పండగల సమయంలో ఉద్యోగులకు భారీగా బోనస్లు, కార్లు, ఫారిన్ ట్రిప్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ కంపెనీ.. తమ కంపెనీ ఉద్యోగుల్లో కొందర్ని లండన్ ట్రిప్కు తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీంతో ఆ ఉద్యోగులు ఇప్పుడు సంతోషంలో మునిగి తేలుతున్నారు.
చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ కాసాగ్రాండ్.. తన ఉద్యోగుల కృషిని గుర్తించి 1,000 మందికి వారం రోజుల పాటు లండన్ ట్రిప్ను బహుమతిగా ఇచ్చింది. ఇది కంపెనీ వార్షిక ప్రాఫిట్ షేర్ బోనాంజా కార్యక్రమం కింద తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. భారత్, దుబాయ్లలోని తన 7 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం అంటే 1,000 మందిని.. ఎంపిక చేసి, వారి కోసం లండన్ పర్యటనకు స్పాన్సర్ చేసింది. కంపెనీ విజయంలో ఉద్యోగుల భాగస్వామ్యాన్ని గుర్తించి.. వారిని సంతోషపెట్టాలనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 6 వేల మందికి పైగా ఉద్యోగులను.. మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్, స్పెయిన్ వంటి ఇంటర్నేషనల్ టూర్లకు తీసుకెళ్లారు. ఇక ఈ లండన్ ట్రిప్లో.. ఉద్యోగుల హోదా లేదా ర్యాంక్తో సంబంధం లేకుండా అందరికీ సమాన ప్రయాణం అందించి.. కలిసి బస చేసేలా కంపెనీ ఏర్పాట్లు చేసింది. ఇక ఈ లండన్ టూర్లో సెయింట్ పాల్స్ కేథడ్రల్, లండన్ బ్రిడ్జ్, బిగ్ బెన్, బకింగ్హామ్ ప్యాలెస్ వంటి ఫేమస్ ప్రదేశాలను సందర్శించనున్నారు.
మరోవైపు.. థేమ్స్ నదిపై క్రూయిజ్లో కూడా ప్రయాణం చేయనున్నారు. ఉద్యోగుల కృషి, పట్టుదల కంపెనీ విజయానికి, అభివృద్ధికి ఇంధనంగా పనిచేస్తుందని కాసాగ్రాండ్ నమ్ముతుందని.. ఇలాంటి బహుమతులు ఉద్యోగుల్లో కంపెనీ పట్ల విధేయతను, ప్రేరణను పెంచుతాయని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి విదేశీ ట్రిప్లు ఉద్యోగులకు బహుమతిగా ఇవ్వడం కాసాగ్రాండ్ ప్రత్యేక సంస్కృతిగా మారింది. దీని వల్ల కంపెనీ విలువ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
ప్రతీ సంవత్సరం తమ ఉద్యోగులను ఇలాంటి బహుమతులతో అభినందించినప్పుడు.. చాలా సంతోషంగా ఉంటుందని.. కాసాగ్రాండ్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఎంఎన్ తెలిపారు. తమ ఉద్యోగులే తమ సంస్థకు ఆత్మ వంటివారని.. వారి ఆనందాన్ని, కళ్లల్లో ఆనంద భాష్పాలను చూసినప్పుడు తాము చాలా గర్వంగా, సంతోషంగా ఉంటామని వెల్లడించారు. సంపదను పంచుకోవడంలో తమకు నమ్మకం ఉందని.. తమ ఉద్యోగుల్లో చాలా మందికి జీవితంలో ఇదే తొలి విదేశీ పర్యటన కావడం లేదా మళ్లీ ఇలాంటి అనుభవాన్ని పొందడం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు.
Latest News