|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 07:53 PM
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తమ కుమార్తె ప్రేమించిన యువకుడు సక్షమ్ తాతే (20)ను తక్కువ కులం వాడనే కారణంతో యువతి కుటుంబం దారుణ హత్యకు పాల్పడింది. యువతి అంచల్ మామిద్వార్ (21) ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సక్షమ్ మృతదేహాన్ని అంచల్ ‘పెళ్లి’ చేసుకుంటున్న హృదయ విదారక దృశ్యాలు వైరల్ అయ్యాయి. తాజాగా, అంచల్ మాట్లాడుతూ.. తమ పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పి తన తల్లిదండ్రులు, సోదరులు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని అన్నారు. అంతేకాదు, తన సోదరులను సక్షమ్పై దాడి చేసేలా రెచ్చగొట్టిన వారిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించింది.
‘‘మేము మూడేళ్లుగా కలిసి ఉన్నాం. ఎన్నో కలలు కన్నాం. నా సోదరులు మా పెళ్లి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో వారు మమ్మల్ని మోసం చేశారు’’ అని ఆమె కన్నీటిపర్యంతమైంది. సక్షమ్ను తన సోదరుల ద్వారా కాకుండా ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడని అంచల్ స్పష్టం చేసింది. తన కుటుంబ సభ్యులు సక్షమ్తో స్నేహంగా ఉండేవారని, కలిసి భోజనం చేసేవారని ఆమె చెప్పింది. ‘అంతా బాగానే ఉందని అతన్ని నమ్మించారు. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు’ అని ఆమె వాపోయింది.
తాము బీసీలమైతే.. సక్షమ్ 'జై భీమ్ వాలా' అని తన కుటుంబ సభ్యులు చెప్పేవారని తెలిపింది. ‘ఒకరోజు నా తండ్రి సక్షమ్తో, నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా మతంలోకి, హిందూ ధర్మంలోకి మారాలని చెప్పాడు. సక్షమ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.. మా నాన్న అవకాశం ఎదురుచూశారు.. కానీ ఏం జరిగిందో నాకు తెలియదు.. ఆ రోజు (నవంబరు 27న) ఉదయం మేము మాట్లాడుకున్నాం.. తర్వాత సక్షమ్, తన బంధువును రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు.. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు.. మర్నాడు ఉదయం పత్రికల్లో న్యూస్ చూసి షాకయ్యాను.. దీని గురించి నాకు ఎవరూ చెప్పలేదు..’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
ధీరజ్ కోమల్వార్, మహీత్ అసార్వార్ అనే ఇద్దరు పోలీసులు తన సోదరులను రెచ్చగొట్టారని అంచల్ ఆరోపించింది. ‘‘హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటలకు నా సోదరుడు నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి, సక్షమ్పై తప్పుడు కేసు పెట్టమని అడిగితే నిరాకరించాను. అప్పుడు పోలీసులు నా సోదరుడితో ‘నువ్వు మనుషులను చంపి ఇక్కడికి వస్తుంటావు. నీ చెల్లితో సంబంధం పెట్టుకున్న వాడిని ఎందుకు చంపకూడదు?’ అని అన్నారు. దానికి నా సోదరుడు, 'సరే, సాయంత్రంలోగా అతన్ని చంపి మీ దగ్గరకు వస్తాను’ అని బదులిచ్చాడు’’ అని అంచల్ తెలిపింది.
పోలీసులు ఇలా ప్రవర్తిస్తే ప్రజలు వారిని ఎలా నమ్మాలని ఆమె ప్రశ్నించింది. సక్షమ్కు కూడా క్రిమినల్ రికార్డులు ఉన్నాయని తెలిసింది. నవంబరు 28న గురువారం సాయంత్రం సక్షమ్, అతడి స్నేహితులు, అంచల్ సోదరుడు హిమేష్ మామిద్వార్ మధ్య మొదలైన గొడవ, కొట్లాటగా మారిందని సమాచారం. ఈ క్రమంలో సక్షమ్పై హిమేష్ కాల్పులు జరపడంతో బుల్లెట్ అతని పక్కటెముకలకు తగిలింది. ఆ తర్వాత తలపై టైల్స్తో కొట్టి అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటనలో హిమేష్, అతడి సోదరుడు సాహిల్, వారి తండ్రి గజానన్ మామిద్వార్, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మర్నాడు సాయంత్రం సక్షమ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా అంచల్ అతడి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ‘గత మూడేళ్లుగా సక్షమ్ను ప్రేమించాను, కానీ కుల భేదాల కారణంగా మా సంబంధాన్ని తండ్రి వ్యతిరేకించాడు. సక్షమ్ను చంపేస్తామని తరుచూ నా కుటుంబం బెదిరించేది, ఇప్పుడు అదే చేశారు. నాకు న్యాయం కావాలి. నిందితులకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నాను’’ అని ఆమె మీడియాతో అన్నారు. తాను సక్షమ్ కుటుంబంతోనే ఉంటానని ఆమె తెలిపింది.
‘ఈ హత్య కులం వల్లే జరిగింది. నా తండ్రి, సోదరులు గ్యాంగ్స్టర్లు.. సక్షమ్కు ఇది తెలుసు. మా కూతురితో మాట్లాడటానికి అతనికి ఎలా ధైర్యం వచ్చింది? అని అనేవారు’ అని పేర్కొంది. సక్షమ్ కుటుంబం తనను కుటుంబసభ్యురాలిగా అంగీకరించిందని, తాను ఎప్పటికీ వారితోనే ఉంటానని అంచల్ తేల్చిచెప్పింది. తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. తన వెంట చాలా మంది ఉన్నారని, కులం కోసం చంపుకోకూడదని ఆమె వ్యాఖ్యానించారు.
Latest News