|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 04:47 PM
‘దిత్వా’ తుపాను దక్షిణ భారతదేశంపై విరుచుకుపడేందుకు సిద్ధమైంది. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుపాను ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు వేగంగా కదులుతోంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను కారణంగా అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం ‘దిత్వా’ తుపాను ఈ ఉదయానికి శ్రీలంక తీరాన్ని దాటి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, మరింత బలపడే అవకాశం ఉంది. ఇది నవంబర్ 30వ తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోకి చేరుకుంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కొన్నిసార్లు వీటి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కడలూరు, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ గాలుల వల్ల చెట్లు కూలిపోవడం, మట్టి ఇళ్లు దెబ్బతినడం, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడం వంటివి జరగవచ్చని ఐఎండీ హెచ్చరించింది. పట్టణ ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
Latest News