|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 10:19 AM
భారత సైన్యానికి త్వరలో అత్యాధునిక గన్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న 1940లో రూపొందించిన స్టెర్లింగ్ కార్బైన్లను సైన్యం తొలగించనుంది. వాటి స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్లను అందించేందుకు చర్యలు చేపట్టింది.ఈ నూతన గన్ల తయారీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ , భారత్ ఫోర్జ్ లిమిటెడ్లతో సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు డీఆర్డీఓ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్లు ఎల్-1 బిడ్డర్లుగా ఎంపికయ్యాయి. తయారీ బాధ్యతను కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ నిర్వహించనుంది.ఈ నూతన అత్యాధునిక గన్ల ప్రత్యేకత ఏమిటంటే ఈ కార్బైన్ 5.56×45 మిల్లీమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని పూణేలోని డీఆర్డీఓ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేసింది. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ వీటి ఉత్పత్తిని చేపట్టనుంది.ఈ కార్బైన్లు చిన్నగా, తేలికపాటిగా ఉంటాయి. దీంతో ఎన్కౌంటర్ల సమయంలో సైనికులు వేగంగా స్పందించగలుగుతారు. ఇందులో అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఆప్టిక్స్, లేజర్ డిజిగ్నేటర్స్ వంటి ఆధునిక యాక్సెసరీలు అమర్చబడి ఉంటాయి. ఈ ఒప్పందం కింద దాదాపు నాలుగు లక్షలకు పైగా సీక్యూబీ గన్లను తయారు చేసి సైన్యానికి అందించనున్నట్లు తెలుస్తోంది.
Latest News