|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 04:55 PM
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునఃప్రారంభించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలోని నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని, ఇన్నాళ్లూ అన్యాయంగా నీటిని పొందిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ, "అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేము, కానీ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారతదేశానికి ఉంది. మేం అదే చేశాం" అని అన్నారు. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే అంశం ఉందని, అయితే ఒకసారి దాన్ని ఉల్లంఘించిన తర్వాత రక్షించడానికి ఏమీ మిగలదని ఆయన స్పష్టం చేశారు.భారతదేశానికి హక్కుగా దక్కిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకుంటామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కెనాల్ నిర్మించి పాకిస్థాన్కు వెళ్లే జలాలను రాజస్థాన్కు మళ్లిస్తామని ఆయన వివరించారు. "ఇంతకాలం పాకిస్థాన్ అన్యాయంగా నీటిని పొందింది. ఇకపై ఆ దేశం గొంతు ఎండిపోవాల్సిందే" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
Latest News